Star Couple Divorce: టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందిన జై భానుశాలి..మహి విజ్.. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. 16 సంవత్సరాలుగా కలిసి జీవించిన ఈ జంట..ఇకపై వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ నిర్ణయంలో ఎలాంటి ద్వేషం..నెగెటివిటీ లేదని స్పష్టంగా చెప్పారు.
ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వాళ్ళిద్దరి పోస్టులో.. “మా జీవన ప్రయాణంలో.. ఇక వేర్వేరు దారులు ఎంచుకుంటున్నాం. అయినా కూడా ఒకరికి ఒకరం అండగా ఉంటాం. శాంతి, ఎదుగుదల, దయ, మానవత్వం అనే విలువలే మాకు ఎప్పుడూ మార్గదర్శకాలు” అని పేర్కొన్నారు. ఈ మాటలు అభిమానులను బాధకు గురి చేస్తున్నాయి.
ముఖ్యంగా తమ పిల్లల విషయంలో.. ఇద్దరూ చాలా స్పష్టంగా మాట్లాడారు. తమ పిల్లలు తారా, ఖుషి, రాజ్వీర్ల కోసం మంచి తల్లిదండ్రులుగా..మంచి స్నేహితులుగా ఉండేందుకు.. కట్టుబడి ఉన్నామని తెలిపారు. “మేము వేరు దారుల్లో నడుస్తున్నా… ఈ నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ కానీ.. డ్రామా కానీ లేదు. మేము కేవలం ప్రశాంతతనే ఎంచుకున్నాం ” అని చెప్పారు.

జయ్ భానుశాలి తమ ప్రకటన చివరలో అభిమానులను ఒక చిన్న విజ్ఞప్తి చేశారు. “మేము ఒకరిని ఒకరం గౌరవించుకుంటూనే ఉంటాం. స్నేహబంధం అలాగే కొనసాగుతుంది. ఈ సమయంలో మాకు మీ ప్రేమ, గౌరవం, దయ అవసరం” అని కోరారు.
జయ్.. మహీ ఇద్దరూ తొలిసారి ఒక క్లబ్లో కలుసుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే మహీనే తన జీవిత భాగస్వామి అని జయ్ నిర్ణయించుకున్నారని గతంలో చెప్పాడు. 2010లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం రాజ్వీర్.. ఖుషిలకు ఫోస్టర్ పేరెంట్స్గా మారారు. 2019లో ఐవీఎఫ్ ద్వారా కుమార్తె తారాకు జన్మనిచ్చారు.
2025 నుంచే వీరి మధ్య విభేదాలపై పుకార్లు వినిపించాయి. అయితే అప్పట్లో మహీ వాటిని ఖండించారు. ఇప్పుడు అధికారిక ప్రకటనతో అన్ని సందేహాలకు ముగింపు పలికారు. వేరైనా..పిల్లల కోసం కలిసి ముందుకు సాగుతామని ఈ జంట మరోసారి స్పష్టం చేసింది.
అయితే ఏకంగా 16 సంవత్సరాల తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడంతో వీరి అభిమానులు కొద్దిగా నిరాశ చెందుతున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అంటూ చింతిస్తున్నారు. కారణమేదైనా ఇలాంటి ఒక అపురూపమైన జంట విడిపోవడం అందరిని నిరాశకు గురిచేస్తుంది.