ఏపీలో భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ కోసం పెద్దఎత్తున వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇవాళ ఉదయం అక్కడ విమానం ల్యాండ్ అయ్యింది. రన్ వేను పరీక్షించారు. అక్కడ టెస్టు ఫ్లైట్ విజయవంతం కావడంతో తమ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టుకు బీజం పడిందని, తమ హయాంలో అనుమతులు, ల్యాండ్ పూలింగ్ చేసినట్టు మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున ప్రచారం చేసుకోవడం మొదలెట్టారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉన్నదని పెద్దఎత్తున నేతలు స్టేట్మెంట్స్ ఇవ్వడంతో పాటు వైసీపీ సోషల్ మీడియా కూటమి సర్కార్ మీద విషప్రచారం కూడా మొదలెట్టినట్టు తెలుస్తున్నది.
వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు మొత్తమే జరగలేదని చెప్పడం సరికాదు..వాస్తవానికి ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు ఆలోచన 2014లో నాటి సీఎం చంద్రబాబుది. ఆ తర్వాత అందుకోసం ల్యాండ్ పూలింగ్, రైతుల నుంచి అభ్యంతరాలు, కోర్టు కేసులు ఇలా పెద్ద వ్యవహారమే నడిచింది. ఆ తర్వాత 2019లో వచ్చిన జగన్ సర్కార్ ఎయిర్ పోర్టు కోసం పనులు చేపట్టినా అవి నత్తనడకన సాగాయి. ఎందుకంటే ఆ టైంలో కేంద్రం నుంచి జగన్కు పెద్దగా మద్దతు లేకపోవడమే అని తెలుస్తున్నది. ఎంపీలు ఎంతమంది ఉన్నా నిధులు రాబట్టడంలో జగన్ ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు.
జగన్ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ప్రారంభమై 30 నుంచి 40 శాతం మాత్రమే పనులు పూర్తయినట్టు సమాచారం. కానీ, కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు చొరవ, మరోవైపు ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామి కావడం, పైగా కేంద్రవిమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉండటంతో భోగాపురం ఎయిర్ పోర్టుకు చాలా కలిసివచ్చిందనే చెప్పాలి. నిధులు విడుదలకు కేంద్రమంత్రి ప్రత్యేక చొరవ చూపారు. ఇక చంద్రబాబు ఎన్డీయేలో కీ రోల్ అయినందున ఆయన అడగ్గానే కేంద్రం నిధుల విడుదలపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేకపోయింది.
ఫలితంగా గత ఏడాదిన్నర సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టు 90 శాతం విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఆదివారం టెస్టు ఫ్లైట్ ను పరీక్షించారు. ఏకంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అదే టెస్టు ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర భవిష్యత్ త్వరలోనే మారనుందని, రానున్న 4 నెలల్లో ఎయిర్ పోర్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఎయిర్ పోర్టు అంటే కేవలం ప్రాంతం కాదని.. అభివృద్ధికి చిహ్నం అని అన్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, వాణిజ్య కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా వెలిగిపోతుందన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయిని చేరుకున్నామన్నారు. జగన్ స్పందిస్తూ.. తహ హయాంలో తీసుకున్న చురుకైన నిర్ణయాల వల్లే ఈ విజయం సాధించామని చెప్పుకొచ్చారు. దీనిపై అటు వైసీపీ,ఇటు తెలుగు తమ్ముళ్ల మధ్య సోషల్ వార్ నడుస్తోంది. చంద్రబాబు పూర్తి చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం జగన్కే చెల్లిందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.