Big Breaking:సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సెలబ్రిటీలను ఇటు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తులు మరణించడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న వైవిఎస్ చౌదరి (YVS Chowdary)తల్లి యలమంచిలి రత్నకుమారి (Y. Ratna Kumari) సెప్టెంబర్ 25 గురువారం రాత్రి 8:31 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు డైరెక్టర్ వైవీఎస్ చౌదరి.
స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తన తల్లిపై ఉన్న ప్రేమను ఇలా రూపంలో పంచుకుంటూ.. “మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీ శక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు. కానీ.. ఒక లారీ డ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుండీ దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండి వంటలు, నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. తన నోటి మీది లెక్కలతో బడ్జెట్ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు..
వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు.. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మ.
ALSO READ:Zubeen Garg: స్టార్ సింగర్ మృతి.. మ్యూజీషియన్ అరెస్ట్.. మరణంపై ఎన్నో అనుమానాలు!
అమ్మ మరణం.. తీరని దుఃఖం – వైవిఎస్ చౌదరి
అటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, రాత్రి గం8.31ని॥లకు.. ఈ భువి నుండి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు.. ” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆమె వయసు 88 సంవత్సరాల కావడంతో వయసు పైబడి ఆమె మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఆమె మృతికి గల కారణాలను మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించలేదు.