Mallu Bhatti Vikramarka: గద్దర్ పేరు మీద అవార్డును ప్రకటించి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనా విధానం ఏమిటో సమాజానికి, ప్రపంచానికి తెలియజెప్పామని అన్నారు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రెండో ఎడిషన్ హైదరాబాద్లో గురువారం గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ..
‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అవార్డు గ్రహితలలో ప్రముఖులుగా ఉన్న చిరంజీవి, కమల్ హాసన్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, నాగార్జున, ఈ తెలంగాణ గద్దర్ అవార్డులకు ఎంపికైన వారందరికీ, ఈ వేడుకకు వచ్చిన, వీక్షిస్తున్న వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా, దేశానికే తలమానికంగా ఎదగాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇస్తున్నారు. గతంలో ఒక 10 సంవత్సరాల పాటు ఈ అవార్డ్స్ని ఇవ్వకుండా ఉంటే, తిరిగి వాటిని ప్రవేశపెట్టి, ఈ చలన చిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు, ప్రపంచానికే పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ అవార్డ్స్ని ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.
ఈరోజు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశ పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో, హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్లినటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. సినిమా అన్నా, కళలన్నా, కేవలం కళల కోసమే కాదు, ఇది ప్రజల కోసమని చెప్పి చాటినటువంటి అనేక సినిమాలు ఈ రాష్ట్రంలో, దేశంలో మనం చూశాం. తెలుగు సినిమాలు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను, అనేక సందేశాత్మక చిత్రాలను తీసి, కేవలం సందేశం ఇవ్వడమే కాదు, కమర్షియల్గా కూడా విజయాలు సాధించిన అనేక సినిమాలను మనం చూశాం. ‘సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దాన వీర శూర కర్ణ’ వంటి సినిమాలెన్నో సందేశాలను ఇవ్వడమే కాకుండా, పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఒక మార్పు కోసం నాంది పలికిన అనేక సినిమాలు ఈ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ముందుకొచ్చాయి. ఈ రోజుకు కూడా ఈ చిత్రసీమ అవార్డ్స్ సందర్భంగా తీసినటువంటి అనేక సినిమాలు, సామాజిక సందేశంతో వచ్చినటువంటి అనేక సినిమాలకు.. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు ఛైర్మన్గా జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి, చాలా ట్రాన్స్పరెంట్గా ఈ అవార్డులు ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
అదే స్థాయిలో ఈ అవార్డులను ప్రకటించిన తర్వాత, ఈ అవార్డులను అందుకోవడం కోసం రాష్ట్రం నుంచే కాకుండా, దేశంలోని నలుమూలల నుంచి ఇక్కడకు విచ్చేసిన నటీనటులందరినీ కూడా అభినందిస్తున్నారు. వారు ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనాలని ఇంత దూరం వచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలందరి తరపున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా, ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్లో గద్దర్ అనేటటువంటి ఒక వ్యక్తి.. వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా సందేశాత్మకమైన తెలంగాణ ఆటని, పాటని, తెలంగాణ ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఒక గొప్ప కళాకారుడు. అటువంటి గద్దర్ పేరు మీద అవార్డును ప్రకటించి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనా విధానం ఏమిటో సమాజానికి, ప్రపంచానికి తెలియజెప్పడం కోసం.. ఆయన పేరు మీద ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది ఇంత విజయవంతం కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తే, పాల్గొన్న నటీనటులకు, అవార్డులు పొందిన వారికి కూడా భవిష్యత్లో ఇంకా ఎన్నో పాత్రలు మీరు చేయాలని, ఆ పాత్రల ద్వారా ఈ సమాజానికి సందేశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.