Uday Kiran: టాలీవుడ్ ‘లవర్ బాయ్’ ఉదయ్ కిరణ్ మరణం జరిగి దశాబ్ద కాలం గడిచినా, ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో చెక్కుచెదరలేదు. ఆయన మరణం చుట్టూ అప్పట్లో ఎన్నో పుకార్లు, మరెన్నో అనుమానాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తన భార్య విషితతో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే, ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఈ అంశంపై పూర్తి స్పష్టతనిస్తూ ఆ ప్రచారాలన్నీ అవాస్తవమని తేల్చి చెప్పారు.
Read also-TVK Vijay: విజయ్ చివరి సినిమాకి ఎందుకు ఇన్ని కష్టాలు.. విడుదల ఆ తర్వాతే!
ఉదయ్ కిరణ్, విషితలది ప్రేమ వివాహం. తన ప్రేమ విషయం గురించి ఉదయ్ మొదట తన అక్క శ్రీదేవికే చెప్పారు. ఆ సమయంలో ఆయన ఎంతో సంతోషంగా ఉండేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. “ఉదయ్ తన భార్యను ఎంతో ప్రేమించేవాడు. పెళ్లి తర్వాత కూడా వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా, కలిసినా వారు చాలా హ్యాపీగా కనిపించేవారు. వారి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వార్తల్లో అస్సలు నిజం లేదు” అని శ్రీదేవి స్పష్టం చేశారు.
ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి పాల్పడిన రోజు ఉదయం కూడా శ్రీదేవితో సుమారు 10 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. ఆ సంభాషణలో ఉదయ్ ఎంతో సానుకూలంగా ఉన్నారని, న్యూ ఇయర్ సందర్భంగా తాను మళ్ళీ సినిమాల్లోకి గ్రాండ్ గా వస్తానని (కమ్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్) చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి కొన్ని గంటల వ్యవధిలోనే అంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఇప్పటికీ తమకు ఒక మిస్టరీగానే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయ్ కిరణ్ అన్నయ్య కూడా గతంలో 21 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ప్రపంచంలో జరిగే అన్యాయాలను చూసి తట్టుకోలేక అంతటి నిర్ణయం తీసుకున్నారని శ్రీదేవి వివరించారు. ఉదయ్ కూడా తన మనసులోని బాధను ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకునే స్వభావం కలవాడని, ఆయన మరణానికి కెరీర్ లో వచ్చిన చిన్న గ్యాప్ లేదా ఏదైనా క్షణికావేశం కారణం కావచ్చేమో తప్ప భార్యతో గొడవలు మాత్రం కాదని ఆమె తేల్చి చెప్పారు.
ఉదయ్ కిరణ్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. కానీ శ్రీదేవి మాట్లాడుతూ, ఆయనకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవని, మరణించే సమయానికి కొన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలిపారు. ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఇచ్చిన ఈ క్లారిటీతో, ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు తెరపడినట్లయింది. ఒక స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్, వ్యక్తిగతంగా ఎంతో సున్నిత మనస్కుడని, అందరినీ నవ్విస్తూ తన బాధను మాత్రం ఎవరికీ తెలియనివ్వలేదని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. విషితతో ఆయన బంధం ఎంతో బాగుందని, కేవలం పుకార్ల వల్ల ఆమెను నిందించడం సరికాదని శ్రీదేవి ఈ ఇంటర్వ్యూ ద్వారా విన్నవించారు.