One Rupee Marriage: రాజస్థాన్లో వివాహం అంటే లక్షలు కాదు కోట్లు ఉండాల్సిందేనని చెబుతారు. ఎందుకంటే వ్యాపార దిగ్గజాల వివాహాలు అక్కడే జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ గా చెబుతుంటారు. అలాంటి రాష్ట్రంలో కేవలం ఒక్క రూపాయి పెళ్లి. విచిత్రంగా ఉంది కదూ. అసలు డీటేల్స్ లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
రాజస్థాన్లో విచిత్రమైన పెళ్లి-రాజస్థాన్లో సికర్ జిల్లాలోని మద్నీ-మండా ప్రాంతం అది. బురానియా ఫ్యామిలీలో అర్జున్రామ్ కొడుకు సుభాష్కు సొంత ప్రాంతానికి చెందిన సరోజ్ అనే అమ్మాయితో వివాహం ఓకే అయ్యింది. నిశ్చితార్థం సమయంలో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యాయి. అనుకున్నట్టుగా వరుడు సుభాష్.. కేవలం ఒక్క రూపాయి, కొబ్బరికాయ తీసుకొని సరోజ్ను పెళ్లి చేసుకున్నాడు.
తమ కుటుంబంలో జరిగే పెళ్లిళ్లకు కట్నం తీసుకోరాదని ఆలోచన చేసిందట ఆ ఫ్యామిలీ. గతంలో అర్జున్ కూతురు పింకీ వివాహానికి కట్నం ఒక్క పైసా ఇవ్వలేదు. వచ్చిన అల్లుడికి ఒక్క రూపాయి-కొబ్బరికాయ మాత్రమే ఇచ్చారు. అదే సంప్రదాయం ఇప్పుడు కొడుకు పెళ్లిలో జరిగింది.
ఒక్క రూపాయితో పెళ్లి- కొత్త సంప్రదాయం కాదు.. ఏళ్ల తరబడి బురానియా ఫ్యామిలీకి ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంప్రదాయం తన తండ్రి బోదురామ్ బురానియా సమయం నుంచి మొదలు పెట్టినట్టు చెప్పారు అర్జున్ మరొక కొడుకు డాక్టర్ యుధ్వీర్ సింగ్. ఆనాటి నుంచి తాము ఏ కుటుంబంలో జరిగే ఏ వివాహాలకు కట్నం ఇవ్వకూడదని, తీసుకోరాదని తీర్మానించుకున్నట్లు చెప్పారు.
చదువే ఆస్తి అని నమ్మే కుటుంబం-సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఒక రూపాయి, కొబ్బరికాయతో వివాహాలు జరిపించాలని డిసైడ్ అయినట్టు డాక్టర్ యుధ్వీర్ తెలిపాడు. బురానియా ఫ్యామిలీ వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చింది. విద్యను గొప్ప ఆస్తిగా పరిగణిస్తుంది ఆ ఫ్యామిలీ. ఆ కుటుంబంలోని ఇద్దరు కూతుళ్లు డాక్టర్ సుమన్, డాక్టర్ ప్రియాంక వైద్య రంగంలో సేవలందిస్తున్నారు.
వారి అన్నయ్య మహేష్ కుమార్ సశస్త్ర సీమా బల్-SSB లో దేశానికి సేవ అందిస్తున్నారు. ఇక ఆ కుటుంబం అల్లుడు డాక్టర్ పంకజ్ నితర్వాల్ జైపూర్లోని SMS మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. సామాజికంగా ఇలాంటి అంశాలను ప్రోత్సహించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. పిల్లలకు విద్యను అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే గొప్ప కట్నమని నమ్ముకుంది బురానియా ఫ్యామిలీ.
ALSO READ: మహారాష్ట్రలో భారీ వర్షాలకు కొట్టుకొచ్చిన 3 వేల గ్యాస్ సిలిండర్లు
వరకట్నం ఇవ్వడం.. తీసుకోవడం చట్ట రీత్యా నేరం కూడా. అదంతా ప్రస్తుతం కాగితాలకు పరిమితమవుతోంది. ఇప్పుడున్న రోజుల్లో ఆడపిల్లకు పెళ్లి చేయడం తలకు మించిన భారంగా మారింది. కట్నం తీసుకోకపోయినా దానికి తగ్గట్టుగా బంగారం, వెండి, వాహనం ఇస్తుంటారు. కానీ బురానీయా కుటుంబం ఒక్క రూపాయి కట్నంగా తీసుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.