Pune Collapse: మహారాష్ట్రలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే పుణె సమీపంలో ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
శిథిలాల కింద 15 మంది!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి పుణె పరిసర ప్రాంతమైన పింప్రి-చించ్వాడ్లో ఒక మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సుమారు 15 మంది వరకు ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాలను తొలగించి, లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి!
6 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
పుణె, పింప్రి-చించ్వాడ్ పరిసరాల్లో వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. దాదాపు 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించింది. బాధితులకు అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలను అధికారులు అందిస్తున్నారు.
విద్యాసంస్థల బంద్.. రెడ్ అలర్ట్ జారీ
వాతావరణ శాఖ (IMD) రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు పుణె, పింప్రి పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షితంగా ఉండాలని యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది.