Tamilnadu: వినాయక చవితి పండుగను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఓ వ్యాపారి. అది కాస్త వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెలువెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హోటల్ యజమానిని అరెస్టు చేసిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.
తమిళనాడులోని తిరునల్వేలి-తిరుచెందూర్ ప్రధాన రహదారిలో వీఎం ఛత్రం వద్ద ఓ బిర్యానీ షాపు ఉంది. సోమవారం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రమోషనల్ బ్యానర్ వివాదానికి దారి తీసింది. చికెన్ బిర్యానీ ప్రకటనలో గణేశుడి చిత్రాన్ని వినియోగించాడు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 13, 14 తేదీల్లో కేవలం రూ. 99కే అరబిక్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ అందిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ బ్యానర్పై గణేశుడు బిర్యానీ వండుతున్నట్లుగా చిత్రాన్ని ముద్రించారు. ఈ వ్యవహారం కాస్త అందరి దృష్టిలో పడింది.
బ్యానర్ను గమనించిన స్థానికులు-హిందూ సంఘాల సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మనోభావాలను కించపరచడమేనని ఆరోపిస్తూ షాపు వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తొలుత షాపు ఏర్పాటు చేసిన బ్యానర్ను తొలగించారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రకటనలు ఇవ్వకూడదని యజమానిని హెచ్చరించారు పోలీసులు. ఈ వ్యవహారంపై పలువురు తిరునల్వేలిపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు. షాపు యజమాని జయంత్ను అరెస్ట్ చేశారు.
ALSO READ: రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు
ఈసారి తమిళనాడు అంతటా విశిష్టమైన గణేశ్ విగ్రహాలు కొలువుదీరాయి. తమిళనాడు వ్యాప్తంగా సుమారు 1.5 లక్షల విగ్రహాలను ప్రతిష్ఠించారు. చెన్నైలో 5501 బహిరంగ విగ్రహాలు ఏర్పాటు చేశారు. వినాయకుడి వేడుకల నిర్వహణ కోసం గ్రేటర్ చెన్నై పోలీసులు 16,500 మంది సిబ్బందిని, 500 మంది హోం గార్డులను మోహరించారు. ఊరేగింపులు-నిమజ్జనం సెప్టెంబర్ 19, 20 తేదీలలో జరగనున్నాయి. జలాశయాలకు వెళ్లేందుకు 17 మార్గాలను రెడీ చేశారు. పర్యావరణ ఆదేశాల మేరకు పట్టినాపాక్కం, నీలన్కరై బీచ్లలోని సాంప్రదాయ నిమజ్జన ప్రదేశాలుగా ఉన్నాయి.