Assam wife murder case: అస్సాంలోని.. గువాహటిలో జరిగిన ఒక దారుణమైన హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఆరు నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, భార్యపై అనుమానంతో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఇల్లాలిని అత్యంత దారుణంగా నరికి హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను వేరు చేసి ఫ్రిజ్లో దాచాడు. ఈ ఘటన గువాహటిలోని బశిష్ఠపూర్ ప్రాంతంలో జరిగింది. హత్య అనంతరం నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోబోయి మృతి చెందాడు
గువాహటిలోని ఓ అపార్ట్మెంట్లో మూడో అంతస్తులో నివసించే రియా తాలుక్దర్, రమానుజ్ గోస్వామి దంపతులుగా ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. రమానుజ్ ఉబర్ డ్రైవర్గా పనిచేస్తుండగా.. రియా ఒక బొటిక్లో ఉద్యోగం చేస్తోంది. అయితే వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రమానుజ్ తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. రియాకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో రగిలిపోయిన అతడు, తీవ్రమైన కోపంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె తలను వేరు చేసి ఫ్రిజ్లో దాచిపెట్టాడు.
ఈ దంపతుల ఫ్లాట్ నుంచి తరచూ అరుపులు, గొడవలు వినిపించేవని స్థానికులు తెలిపారు. శనివారం రోజు కూడా ఆ ఫ్లాట్ నుంచి ఒక మహిళ ఏడుస్తున్న శబ్దం గట్టిగా వినిపించింది. ఆ తర్వాత ఎలాంటి జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, స్థానికులు హతిగావ్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా.. ఫ్రిజ్లో రియా తల పోలీసులను సైతం షాక్కు గురిచేశారు. వెంటనే నిందితుడైన రమానుజ్ గోస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు కస్టడీ నుంచి పరారవుతూ మృతి:
సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీసులు నిందితుడిని బ్లడ్ టెస్ట్ కోసం హతిగావ్ నుంచి గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ఆ సమయంలో కాళీపాడు మీదుగా నర్కాసుర్ హిల్ వద్దకు చేరుకోగానే.. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడానికి రమానుజ్ కదులుతున్న వెహికిల్ నుంచి దూకేశాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రయత్నంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వెంటనే జీఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సరికే నిందితుడు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.