Rahul Gandhi: దేశంలోని కోట్లాది మంది గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలుస్తున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA) పేరును మార్చేందుకు, చట్టంలో సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న కేంద్రం ఆలోచనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రధాని మోదీకి రెండు అంశాలంటే అస్సలు గిట్టవని రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు. ఒకటి.. మహాత్మా గాంధీ ఆలోచనలు కాగా, రెండోది.. పేద ప్రజల హక్కులని ఆయన విమర్శించారు. మోదీకి మహాత్ముడి సిద్ధాంతాలన్నా, పేదలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించే హక్కులన్నా చిన్నచూపు అని, అందుకే పేదలకు అండగా ఉండే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకం పేరు నుంచి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించే ప్రయత్నం చేయడం అంటే.. నేరుగా గాంధీజీ సిద్ధాంతాలపై దాడి చేయడమేనని ఆయన అభివర్ణించారు.
ఉపాధి హామీ పథకం కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని, అది మహాత్మా గాంధీ కలలు కన్న ‘గ్రామ స్వరాజ్యం’ ఆలోచనలకు, ఆశయాలకు నిలువెత్తు ప్రతిరూపమని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, కరువు కాలంలో పేదలను ఆదుకోవడానికి ఈ విప్లవాత్మక చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకాన్ని ఏదో ఒక రకంగా బలహీనపరచాలని చూస్తోందని ఆరోపించారు.
పేదలకు ఉపాధి హక్కును కల్పించే ఈ చట్టం పేరు మార్చడం, నిధుల్లో కోతలు విధించడం వంటి చర్యలు గ్రామీణ భారతంపై జరుగుతున్న దాడిగా రాహుల్ పేర్కొన్నారు. ఈ కుట్రలను కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, పేదల హక్కులను కాపాడేందుకు పార్లమెంట్ లోపల, బయట పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పథకం పేరు మార్చడం ద్వారా చరిత్రను చెరిపివేయలేరని, గాంధీజీ ఆశయాలను ప్రజల గుండెల్లోంచి తీసివేయలేరని ఆయన కేంద్రానికి చురకలు అంటించారు.