CM Revanth Reddy: తెలంగాణను ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు. హైదరాబాద్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రేవంత్ కోరారు. రాష్ట్రంలో ఉన్న యువత ప్రతిభకు, పరిశ్రమల విస్తరణకు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు అత్యవసరమని సీఎం స్పష్టంగా వివరించారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఐఐఎంలు పనిచేస్తుండగా, ఐటీ, ఫార్మా, స్టార్టప్ హబ్గా పేరొందిన హైదరాబాద్కు ఇప్పటికీ ఐఐఎం లేకపోవడం దురదృష్టకరమని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్కు ఐఐఎం మంజూరైతే దక్షిణ భారతదేశంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్ విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఐఐఎం ఏర్పాటు కోసం అవసరమైన భూమి విషయంలో కూడా.. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఎలాంటి వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. రోడ్లు, నీరు, విద్యుత్, హాస్టల్ సదుపాయాలు వంటి మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు.
అంతేకాకుండా ఐఐఎం తరగతులు ఆలస్యం కాకుండా వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతులు లభించిన వెంటనే విద్యా కార్యక్రమాలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఐఐఎంతో పాటు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల విస్తరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, విద్యా అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. అందుకే తెలంగాణకు 9 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరారు.
గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో.. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల పాత్ర కీలకమని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాకు కనీసం ఒక కేంద్ర విద్యాసంస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యలో ప్రాంతీయ అసమానతలు తొలగించాలంటే ఈ సంస్థల విస్తరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
Also Read: ఓయూలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన డీఈ శ్రీనివాస్
ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.