AIADMK Rebels: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసినందుకు గానూ మాజీ మంత్రి సి.వి. షణ్ముగం సహా 24 మంది ఎమ్మెల్యేలపై అన్నా డీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS) కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ పదవుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు దరఖాస్తు చేయనున్నట్లు అన్నా డీఎంకే పార్టీ ప్రకటించింది. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పార్టీ జారీ చేసిన విప్ ను వారు అతీక్రమించారని పళనిస్వామి వర్గం పేర్కొంది. పార్టీ జారీ చేసిన విప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే.. వారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నాడీఎంకే సీనియర్ నేతలు అన్నారు. దీనికి సంబంధించి ఫిర్యాదును సైతం సమర్పించినట్లు తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకేకు ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో 24 మంది.. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ విశ్వాస తీర్మానంలో విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు లభించడంలో వారు కీలక పాత్ర పోషించారు. అయితే తమ నేతలు.. మంత్రి పదవుల ఆశతోనే విజయ్ పార్టీకి మద్దతు తెలిపారని పళనిస్వామి ఆరోపించారు. దీనిని పార్టీకి చేసిన ద్రోహంగా అభివర్ణించారు.
Also Read: పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. సాక్ష్యాలతో వస్తానంటూ..
అన్నా డీఎంకే చీలిక వర్గానికి నేతృత్వం వహించిన సి.వి. షణ్ముగం.. పళనిస్వామి ఆరోపణలను తప్పుబట్టారు. పళనిస్వామి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన డీఎంకేతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. పార్టీని కాపాడుకోవడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, మెజారిటీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మెుత్తంగా అన్నా డీఎంకే చీలిక వ్యవహారం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.