TN Politics: తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాల్సిన సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు విజయ్ నేతృత్వంలోని టీవీకే మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నిస్తుంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) తమ ఎమ్మెల్యేలు చేజారకుండా రక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను హుటాహుటిన సరిహద్దు దాటించి, పుదుచ్చేరి సమీపంలోని అత్యంత విలాసవంతమైన ‘షోర్ త్రిశ్వం’ రిసార్ట్కు తరలించారు. దీంతో తమిళ రాజకీయాలు ఇప్పుడు రాజధాని చెన్నై నుంచి పుదుచ్చేరి తీరానికి షిఫ్ట్ అయ్యాయి.
షణ్ముగం వర్గం ‘యూ-టర్న్.. విజయ్కి షాక్.. పళనిస్వామికి ఊరట!
ఈ మొత్తం హైడ్రామాకు కేంద్రబిందువుగా షణ్ముగం వర్గం నిలిచింది. నిన్నటి వరకు పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించిన ఈ వర్గం.. అనూహ్యంగా వెనక్కి తగ్గింది. తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్కి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. ఈ పరిణామం విజయ్ శిబిరాన్ని ఆత్మరక్షణలో పడేయగా, అన్నాడీఎంకేలో మళ్లీ పట్టు బిగించేందుకు పళనిస్వామికి అవకాశం దక్కింది.
క్యాంపు రాజకీయాల వెనుక ‘ఆపరేషన్ అకర్ష్’ భయం!
అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు అధికారం దక్కాలంటే ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్రయోగించే అవకాశం ఉందన్న ఆందోళన పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. అందుకే, అసమ్మతి గళం వినిపిస్తున్న షణ్ముగం వర్గంతో పాటు ఇతర కీలక ఎమ్మెల్యేలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రిసార్ట్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, ఎమ్మెల్యేల ఫోన్లపై కూడా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. బయటి వ్యక్తులు ఎవరూ వారితో సంప్రదింపులు జరపకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ విజయానికి పడుతున్న బ్రేకులు.. గడువు ముగుస్తున్న వేళ!
గవర్నర్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ లోపు 118 మంది ఎమ్మెల్యేల మద్దతును నిరూపించుకోవాల్సి ఉండగా, షణ్ముగం వర్గం వెనక్కి తగ్గడం విజయ్కి గట్టి ఎదురుదెబ్బగా మారింది. కాంగ్రెస్ మద్దతు ఉన్నప్పటికీ, అన్నాడీఎంకే నుంచి ఆశించిన మద్దతు లభించకపోతే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టసాధ్యం కానుంది. ఈ గందరగోళం మధ్య స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేల కోసం బేరసారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయ్ తన రాజకీయ చాతుర్యంతో ఈ గండాన్ని గట్టెక్కుతారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Also Read: తెలంగాణలో బీజేపీ ‘మాస్టర్ ప్లాన్’.. టార్గెట్ బీఆర్ఎస్, అసలు గురి కాంగ్రెస్!
తదుపరి అడుగు ఎటు? ఉత్కంఠలో తమిళ తంబీలు!
రిసార్ట్ రాజకీయాలు ప్రారంభమవడంతో తమిళనాడు ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ప్రజాతీర్పును కాదని, క్యాంపులకు వెళ్లడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా విజయ్ మెజార్టీ నిరూపించుకోలేకపోతే, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. గవర్నర్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అన్నాడీఎంకే తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలదా? విజయ్ చివరి నిమిషంలో ఏమైనా ‘మాస్టర్ స్ట్రోక్’ ఇస్తారా? అనే విషయాలు తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
క్యాంపు రాజకీయాలు ప్రారంభించిన AIADMK
16 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరి సమీపంలోని షోర్ త్రిశ్వం రిసార్ట్ కు తరలింపు
నిన్న పలనిస్వామిని కాదని టీవీకే కి మద్దతు ప్రకటించిన షణ్ముఖ వర్గం
లేటేస్ట్ గా విజయ్ కి మద్దతు ఉపసంహరించుకున్న షణ్ముఖ వర్గం
ఎమ్మెల్యేలు చేజారకుండా రిసార్ట్ కు… pic.twitter.com/ewJ0DurS0E
— BIG TV Breaking News (@bigtvtelugu) May 7, 2026