Amarnath Yatra: జమ్మూకాశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు షాకింగ్ న్యూస్. కోట్లాది మంది హిందువులు పూజించే అమర్నాథ్ గుహలోని మంచు లింగం కరిగిపోతోంది. కేవలం ఐదు రోజుల్లో 90 శాతం కరిగిపోయిందన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది. యాత్ర తొలి వారంలో ఇలా జరగడంతో భక్తుల్లో అప్పుడే నిరాశ అలముకుంది.
అమరనాథ్ యాత్ర భక్తులకు షాకింగ్-జమ్మూకాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది తర్వాత అమర్నాథ్ యాత్ర మొదలైంది. ఈ యాత్రకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. రికార్డు స్థాయిలో అమర్నాథ్ యాత్రకు భక్తులు క్యూ కడుతున్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేశారు. 57 రోజుల యాత్రలో భాగంగా కేవలం ఐదు రోజులకు మంచు లింగం దాదాపు 90 శాతానికి పైగా కరిగిపోయింది.
యాత్ర ప్రారంభించిన ఐదు రోజులకే-57 రోజుల యాత్రలో కేవలం ఐదు రోజులకే ఈ విధంగా జరగడం అంతుబట్టడం లేదు. శతాబ్దాలుగా పూజించబడుతున్న పవిత్రమైన మంచు రూపం కరిగిపోవడం పాత చర్చను మళ్లీ రాజేసింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి ఏటా కంటే ముందు మంచు లింగం కరిగిపోతోందా? హిమాలయ పర్యావరణ వ్యవస్థలో పెరుగుతున్న యాత్రికుల సంఖ్య కారణమా?
ఈసారి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు-విస్తరిస్తున్న మౌలిక సదుపాయాల వల్ల మంచులింగం వేగంగా కరిగిపోతుందా? అదే నిజమైతే.. రానున్న రోజుల్లో మంచు లింగం భక్తులకు దూరం కానుందా? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉంది అమర్నాథ్. సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకూ సహజ సిద్ధంగా ఏర్పడుతుంది.
శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గామ్ ద్వారా భక్తులు వెళ్ళాలి. హిందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. జీవితంలో ఒక్కసారైనా శివుడ్ని దర్శించాలని కోరుకుంటారు. వేసవి కాలం తప్ప ఏడాదంతా మంచుతో కప్పబడి ఉంటాయి అమర్నాథ్ హిల్స్. మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.
గ్లోబల్ వార్మింగ్.. మానవ కార్యకలాపాలు- మంచు లింగం ఇంత వేగంగా కరిగిపోవడానికి గ్లోబల్ వార్మింగ్, మానవ కార్యకలాపాలు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గతంలో మంచు లింగం కరిగిన సందర్భాలు ఉన్నాయి. 2018, 2020, 2022 ఏడాదిలో మంచు లింగం కరిగింది. కాకపోతే ఈసారి యాత్ర మొదలైన ఐదు రోజుల్లో 90 శాతం కరిగిపోయినట్టు తెలుస్తోంది.
అమర్నాథ్ గుహకు సమీపంలో రోడ్ల వెడల్పు, హెలికాప్టర్ల రాకపోకలు, రోప్వే ప్రాజెక్ట్ వంటి కారణాలుగా చెబుతున్నారు. దీనికితోడు భక్తుల నుండి వెలువడే వేడి వల్ల గుహ లోపల వాతావరణం వేడెక్కుతోందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఆధ్యాత్మిక యాత్రను భక్తులకు అందుబాటులో ఉంచుతూ హిమాలయాల పర్యావరణాన్ని కాపాడుకోవడంపై వెంటనే అధ్యయనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉన్నాయా? ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నేరుగా మీ అకౌంట్కే!
జూలై 5 నాటికి వేల సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రెండో రోజు 20 వేల మంది యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ స్థాయిలో భక్తులు రావడం ఇదే మొదటిసారి. అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు చీఫ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈసారి భారీగా భక్తులు తరలి వచ్చారన్నది ఆయన మాట.