Guwahati: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తట్టుకోలేకపోయాడు ఆమె భర్త. చంపితేనే గానీ తన పగ తీరదని భావించాడు. అత్యంత దారుణంగా చంపేశాడు. పోలీసులకు దొరికిన తర్వాత అంతా చెప్పాడు. అనూహ్య క్రమంలో నిందితుడు ఈ ఉదయం చనిపోయాడు. గౌహతిలో సంచలనం రేపిన 25 ఏళ్ల రియా హత్య కేసు ఇది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, ఆమె భర్త రమానుజ్ గోస్వామి మృతి చెందాడు. అసలు రియా-రామానుజ్ కేసులోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
గౌహతి సమీపంలోని హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలో రమానుజ్-భార్య రియా తాలుక్దార్ నివాసం ఉండేవారు. ఆరు నెలల కిందట వివాహం జరిగింది. భార్యపై అనుమానంతో రామానుజ్ తరచూ గొడవపడేవాడు. సెప్టెంబర్ మూడున భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తలను వేరు చేసి నల్లటి పాలిథిన్ కవర్ చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచాడు. ఘటన జరిగి మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 6న ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలుపెట్టింది. దీంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది గానీ తల కనిపించలేదు. ఇంట్లో సామాన్లు పరిశీలించగా ఫ్రిడ్జ్లోని పాలిథిన్ సంచిలో ఆమె తలను గుర్తించారు పోలీసులు. ఘటన తర్వాత రమానుజ్ కనిపించకపోవడంతో గాలింపు చేపట్టారు. చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయి భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడాడు రమానుజ్. భార్యను చంపినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, తన భార్య క్యారెక్టర్ మంచిది కాదన్నాడు.
ALSO READ: హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చంపుతానంటూ హెచ్చరించాడు. రియాతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? ఎవర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడు? కస్టడీలో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసినా నోరు విప్పలేదు రమానుజ్. 30 ఏళ్ల రమానుజ్ను వైద్య పరీక్షల తర్వాత సోమవారం వేకువజామున హటిగావ్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు పోలీసులు. నరకాసుర్ పహార్ ప్రాంతం వద్ద పోలీసులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వాహనం నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. లోయలో పడటంతో తీవ్రంగా గాయపడిన రామానుజ్, వెంటనే పోలీసులు గౌహతి మెడికల్ కాలేజ్కి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసినప్పటికే నిందితుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. రియా కేసులో కొన్ని ప్రశ్నలకు అతడి నుంచి సమాధానాలు రాలేదు. అంతలో భర్త-నిందితుడు రమానుజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.