Kedarnath: నైరుతి రుతుపవనాలు తిరోగమనం నేపథ్యంలో సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఉత్తరాధి రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఉత్తరాఖండ్లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాళ్లు పడడంతో కేదార్నాథ్ యాత్ర మార్గం ప్రమాదకరంగా మారింది, కాస్త అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం భద్రతా దళాలు ఈ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తున్నాయి.
భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాదు బండరాళ్లు కిందపడడం, కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ క్రమంలో కేదార్నాథ్ ధామ్ ట్రెకింగ్ మార్గంలోని చిర్బాసా ప్రాంతంలో కొండపైనుంచి రాళ్లు పడుతున్నాయి. ఆ మార్గం ద్వారా వెళ్లే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. యాత్రికుల రాకపోకలను నియంత్రించారు. వాతావరణం మెరుగుపడి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చిర్బాసాలో రాళ్లు కిందకు పడడం ఆగింది. దీంతో ఆ మార్గం ద్వారా వెళ్లాల్సిన యాత్రికులకు ఒక్కొక్కరిగా గౌరీకుండ్ వైపు సురక్షితంగా తరలిస్తున్నారు అధికారులు.
సోమవారం చిర్బాసా ప్రాంతంలో ఆకాశం తేలికపాటి మేఘావృతమై ఓ మాదిరి వర్షం పడుతోంది. వాతావరణం మెరుగుపడగానే యాత్రికుల రాకపోకలు పునఃప్రారంభమవుతా యని అధికారులు తెలిపారు. భద్రతా దళాల పర్యవేక్షణలో యాత్రికులను జాగ్రత్తగా తరలిస్తున్నారు. యాత్రికులు మార్గమధ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆగవద్దని భద్రతా సిబ్బంది సూచనలు ఇచ్చారు. ఆ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భీంబలి నుండి గౌరీకుండ్కు యాత్రికులను దశల వారీగా తరలిస్తున్నట్లు తెలిపారు.
యాత్రికుల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, వైఎంఎఫ్, ఆపద మిత్ర, పోలీసు బలగాల సహాయక బృందాలను ఆ ప్రాంతంలో మోహరించాయి. యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ సున్నితమైన ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. చిర్బాసా ప్రాంతంలోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వాతావరణంలో ఏమైనా మార్పు వస్తే పరిస్థితులకు అనుగుణంగా యాత్రికుల రాకపోకలను తక్షణం నియంత్రిస్తామని తెలిపారు.
ALSO READ: 8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్పై అమిత్ షా ప్రశంసల వర్షం!