CBSE Languages: దేశవ్యాప్త విద్యావిధానంలో సీబీఎస్ఈ బోర్డు (CBSE) విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి అంటే జూలై 1వ తేదీ నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల (Three Language Formula) విధానాన్ని విధిగా అమలు చేయాలని నిర్ణయించింది. నూతన జాతీయ విద్యా విధానం (NEP – 2020) సిఫార్సులకు అనుగుణంగా పాఠ్యాంశాల ప్రణాళికను మార్చాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.
ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు రెండు భాషలను మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు మూడు భాషలను తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. ఆ మూడు భాషల్లో కనీసం రెండు భాషలు కచ్చితంగా భారతీయ మూలాలను కలిగి ఉండాలి. ఉదాహరణకు తెలుగు, హిందీ, సంస్కృతం, తమిళం వంటివి అయి ఉండాలి. మిగిలిన ఒక భాషగా ఇంగ్లీష్ లేదా ఇతర విదేశీ భాషను ఎంచుకోవచ్చు. అయితే పదో తరగతి విద్యార్థులకు ఆ మూడో భాషకు బోర్డ్ ఎగ్జామ్ ఉండదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. అనవసర ఒత్తిడి తగ్గించేందుకే ఈ ఏర్పాటు అని బోర్డ్ పేర్కొంది.
ఈ నూతన విద్యా ప్రణాళికను జూలై 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే కొత్త సెషన్ నుండి అమలు చేయడానికి బోర్డు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఎస్ఈ గుర్తింపు పొందిన పాఠశాలలకు తగిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. కొత్త సబ్జెక్టుల ఎంపిక, ఉపాధ్యాయుల సర్దుబాటు, టైమ్ టేబుల్ మార్పులపై స్కూళ్లు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీబీఎస్ఈ వర్గాలు సూచిస్తున్నాయి.
Also Read: 99% మందికి తెలియని ఏసీ సీక్రెట్.. ఆ ఒక్క చిన్న మార్పుతో.. గదిలోని విష గాలి మాయం!
విద్యార్థుల్లో కేవలం మార్కుల వేట కాకుండా, బహుభాషా నైపుణ్యాన్ని (Multilingualism) పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశమని సీబీఎస్ఈ వర్గాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల పిల్లల మేధోవికాసం మెరుగవుతుందని విద్యావేత్తలు సైతం భావిస్తున్నారు. సీబీఎస్ఈ తీసుకొస్తున్న ఈ మార్పుల వల్ల విద్యార్థులపై కాస్త చదువుల భారం పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Best Smartphones: రూ. 40,000 బడ్జెట్ ఉందా? అయితే ఈ 3 పవర్ఫుల్ ఫోన్లపై ఓ లుక్కేయండి!