India Census 2026: జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న జంటలను వివాహిత జంటగా పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. జనాభా లెక్కల స్వీయ గణన పోర్టల్లో తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానంగా సహజీవనం చేస్తున్న జంటను వివాహిత జంటగా పరిగణిస్తారా? అనే ప్రశ్నకు అధికారులు ఇలా పేర్కొన్నారు. సహా జీవనం చేస్తున్న జంట తమ సంబంధాన్ని స్థిరమైన బంధంగా భావిస్తే, వారిని వివాహిత జంటగా పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది.
చాలా కాలంగా కలిసి ఉంటున్న వారిని కుటుంబంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు జనగణన ప్రక్రియ వివరాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం మీడియాకు తెలిపారు. 16వ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. రెండు దశల్లో జనాభా లెక్కలు చేపట్టనున్నారు. తొలి విడతలో గృహ గణన చేపట్టనున్నారు. మొబైల్ యాప్ ద్వారా సెన్సెస్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు నమోదు చేస్తారు. రెండో విడతలో జనాభా లెక్కల సేకరణ చేస్తారు. రెండో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇంతకు ముందు లేనివిధంగా తొలిసారి స్వయంగా వివరాల నమోదుకు కేంద్రం అవకాశం కల్పించింది. జనగణన నమోదు కోసం 33 ప్రశ్నలతో ఓ ప్రశ్నావళిని కేంద్రం రూపొందించింది.
జనగణన మొదటి దశలో, గణన అధికారులు..ఇంటి నెంబర్, ఇంటి నేల, గోడలు, పైకప్పు కోసం ఉపయోగించిన పదార్థాల గురించి అడుగుతారు. ఆ తర్వాత వారు ఇంటి వినియోగం, దాని పరిస్థితి, ఆ కుటుంబంలో ఉంటున్న వ్యక్తుల సంఖ్యను నమోదు చేస్తారు. ఇంటి వ్యవహారాలను నిర్వహించే, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని గృహ పెద్దగా నిర్ణయిస్తారు. ఈ వ్యక్తి తప్పనిసరిగా కుటుంబంలోని పెద్ద వ్యక్తి, పురుషుడు కానవసరం లేదు. వారు ఏ లింగానికి చెందిన వారైనా కావచ్చు లేదా సాధారణంగా ఆ ఇంట్లో నివసించే చిన్న వయస్సు వారు కూడా కావచ్చు.
ఇంటి యజమాని, అతని వ్యక్తిగత వివరాలు, కులం, కమ్యూనిటీ వివరాలను చెప్పాల్సి ఉంటుంది. ఇంట్లో ఉండే వారి సంఖ్య, వారి వయసు, ఫోన్లు, ఇంటర్నెట్, వెహికల్స్, టీవీ, రేడియో గురించి వివరాలను అడుగుతారు. తృణధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, మరుగుదొడ్లు, వంటగది, వంటకు వినియోగించే ఇంధనం వంటి వివరాలు సేకరిస్తారు. ఈ వివరాలన్నీ అత్యంత సీక్రెట్ గా ఉంటాయని రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. దేశంలో సాధారణంగా 10 సంవత్సరాలకోసారి జనగణన నిర్వహిస్తారు. చివరిగా 2011లో జనాభా లెక్కలు సేకరించారు. కోవిడ్ కారణంగా 2021లో జరగాల్సిన జనగణనకు వాయిదా పడింది.
Also Read: ఈసారి జరిగే జనగణనలో సరికొత్త రూల్.. ప్రతి ఇంటిలో ఇది ఉంటేనే కుటుంబంగా నిర్ధారణ