తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో ప్రతిష్టాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే గొప్ప ఆలోచన రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తాలూకు పూర్తి క్రెడిట్ ముఖ్యమంత్రికే దక్కుతుందని ఆయన కొనియాడారు. పేద ప్రజలు నాణ్యమైన ఆహారం తీసుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్రభుత్వం సన్నబియ్యం పథకం కోసం ఏటా రూ. 14,560 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రంపై ఎంత భారం పడినా సరే పేదవాడి కడుపు నింపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం జనం ఇంట్లో ఏ బియ్యం తింటారో అవే రేషన్ దుకాణాల ద్వారా అందించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 86 శాతం జనాభాకు సన్నబియ్యం ప్రయోజనం అందుతోందని పేర్కొన్నారు. గతంలో సోనియా గాంధీ తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టానికి తెలంగాణలో ఇప్పుడు అసలైన న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రైతు ఖాతాల్లోకి సుమారు రూ. 40,000 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల అకౌంట్లలో నగదు పడేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమ విధానమని ఆయన వివరించారు.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కోట్ల 39 లక్షల మంది సన్నబియ్యం లబ్ధిదారులు ఉన్నారని గణాంకాలు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరినీ లబ్ధిదారులుగా మారుస్తామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన రీతిలో ఆహార భద్రత కల్పించడమే తమ అంతిమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ALSO READ: రావణాసురుడితోనే రాముడికి పేరు.. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి