Toll Plaza: నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. వాహనదారులు టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ప్రయాణం సాఫీగా సాగిపోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టోల్ ఫీజు చెల్లింపులు కేవలం డిజిటల్ రూపంలోనే జరగనున్నాయి.
ఈ కొత్త నిబంధన ప్రకారం, ప్రతి వాహనానికి ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి. ఒకవేళ ఏప్రిల్ 1 తర్వాత ఎవరైనా నగదుతో టోల్ చెల్లించాలని ప్రయత్నిస్తే, అది సాధ్యపడదు.. అంతేకాకుండా నిబంధనల ఉల్లంఘన కింద అదనపు జరిమానా చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది. టోల్ ప్లాజాల వద్ద సిబ్బందితో నగదు మార్పిడి వల్ల కలిగే జాప్యాన్ని నివారించడం ద్వారా ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) వంటి అత్యాధునిక సాంకేతికతను కూడా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానంతో పాటు, భవిష్యత్తులో వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి నేరుగా బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కట్ అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగాల్సిన పని లేకుండా పూర్తి స్థాయి ‘ఫ్రీ-ఫ్లో’ ట్రాఫిక్ సాధ్యమవుతుంది.
Also Read: హై అలర్ట్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఢిల్లీ బీజేపీ పిలుపు
ప్రయాణికులు తమ ఫాస్టాగ్ వాలెట్లలో తగినంత బ్యాలెన్స్ ఉందో లేదో ముందే చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 1 గడువు సమీపిస్తున్న తరుణంలో, పెండింగ్లో ఉన్న కేవైసీ (KYC) ప్రక్రియలను పూర్తి చేసుకోవడం ముఖ్యం. ఈ డిజిటల్ విధానం ద్వారా టోల్ సేకరణలో పారదర్శకత పెరగడమే కాకుండా, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టోల్ గేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏప్రిల్ 1 నుంచి టోల్ గేట్లలో నగదు లావాదేవీలు బంద్
డిజిటల్ పేమెంట్లు మాత్రమే అనుమతించాలని ఆదేశం
Central Government takes key decision on toll gates. Cash transactions banned at toll gates from April 1.Only digital payments will be… pic.twitter.com/QvnqsVD2Qd
— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2026