LPG Gas Price Hike: కొత్త సంవత్సరం వేడుకల్లో ఉన్న సామాన్యులకు, వ్యాపారులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. 2026 నూతన సంవత్సరం మొదటి రోజే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను సుమారు రూ. 111 మేర పెంచారు. ఈ కొత్త ధరలు ఈ రోజు (జనవరి 1, 2026) నుంచే అమలులోకి వచ్చాయి. అయితే, గృహిణులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ (ఇంటి అవసరాలకు వాడే) గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 111 పెరిగి రూ. 1691.50కి చేరింది. ముంబైలో ఈ ధర రూ. 1642.50గా ఉండగా, చెన్నైలో రూ. 1849.50కి చేరింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 111 పెరుగుదలతో ఏకంగా రూ. 1912.50కి చేరుకుంది. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇది పరోక్షంగా సామాన్యులపై భారం మోపనుంది.
గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, వాహనదారులకు మాత్రం కాస్త ఊరట లభించింది. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలలో చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవు. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 107.41 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే, డీజిల్ ధర లీటరుకు రూ. 95.65గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ధరల్లో మార్పు లేదు. విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ. 109.37 (కొన్ని ప్రాంతాల్లో రూ. 109.38)గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ. 97.22 వద్ద ఉంది. మొత్తానికి, కొత్త సంవత్సరం గృహ వినియోగదారులకు, వాహనదారులకు పాత ధరలతోనే స్వాగతం పలికినా, చిన్న వ్యాపారులకు మాత్రం గ్యాస్ ధరల పెంపు ఆందోళన కలిగిస్తోంది.
Read Also: మీ పర్సనల్ డేటాని సేకరిస్తున్న చాట్జీపీటీ.. ఈ జాగ్రత్తలు పాటించండి