Kerala CM: కేరళ సీఎం పేరును గురువారం ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రకటించారు. కేరళ సీఎం ఎంపికపై అధిష్ఠానం అన్ని చర్చలు పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఎవరనేది రేపు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. మే 4న ఫలితాలు రాగా.. సీఎం ఎవరన్న దానిపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేరళ సీఎం ఎంపిక చేసే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం దిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కేపీసీసీ మాజీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ (బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ భేటి అయ్యారు. సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితలలో సీఎంగా ఎవరని నిలబెట్టాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటి వివరాలను తెలియజేస్తూ.. రేపు సీఎం ప్రకటన ఉంటుందని జైరామ్ రమేశ్ వెల్లడించారు.
కేరళ ఫలితాలు వచ్చి సుమారు పది రోజులు కావొస్తున్నా ఇంకా సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించకపోవడంపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. కేరళ ప్రజలు తీర్పు ఇచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా.. వారికి ముఖ్యమంత్రి దొరకలేదంటూ బీజేపీ ఎంపీ బ్రిజ్ మోహన్ అగర్వాల్ ఎద్దేవా చేశారు. వేగంగా నిర్ణయాలు తీసుకోలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శలు చేశారు. అందుకే ప్రజలు వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. 24 మంది ఎమ్మెల్యేలపై వేటు..!
అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. సీఎం రేసులో ఉన్న ముగ్గురు నేతలు.. సమర్థులని పేర్కొంటున్నారు. వీరిలో ఎవరికి బాధ్యత అప్పగించినా సక్రమంగా నిర్వర్తిస్తారని కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ అన్నారు. అయితే కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితలలో ఎవరికి బాధ్యత అప్పగించాలన్న అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోందని చెప్పారు. ఒక పేరును ఖరారు చేసేందుకు తన నాయకత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు.