Delhi Airport GPS Spoofing: దిల్లీ ఎయిర్పోర్టుపై హ్యాకర్లు భారీ కుట్ర చేసినట్లు కేంద్రం ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేసింది. దిల్లీ ఎయిర్పోర్టులో హ్యాకర్లు జీపీఎస్ స్పూఫింగ్కు పాల్పడినట్లు పేర్కొంది. విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పంపి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని వెల్లడించింది. జీపీఎస్ స్పూఫింగ్ జరిగినట్లు విమానయాన శాఖ నిర్ధారించింది. రన్వే నెంబర్ 10పై వచ్చిన విమానాలను తప్పుడు జీపీఎస్ సిగ్నల్ అందినట్లు నిర్ధారించింది. స్పూఫింగ్ ను వెంటనే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రకటించింది.
దిల్లీ నుంచి దేశంలోని అనేక ప్రధాన విమానాశ్రయాలకు చేరుకునే విమానాలలో గత ఏడాది పదే పదే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) స్పూఫింగ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) హ్యాకింగ్ కు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం తెలిపారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) 2023 నవంబర్లో రిపోర్టింగ్ను తప్పనిసరి చేసినప్పటి నుంచి కోల్కతా, అమృత్సర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల నుంచి జీపీఎస్ జామింగ్ లేదా స్పూఫింగ్ సాధారణ నివేదికలు సేకరించామని రామ్ మోహన్ నాయుడు చెప్పారు. ఎంపీ ఎస్. నిరంజన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే 10 పై వచ్చిన పలు విమానాలకు తప్పుడు GPS సిగ్నల్లను పంపారని మంత్రి ధృవీకరించారు.
“హ్యాకర్ల దాడిని వెంటనే గుర్తించి, రన్వేలపై భూ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలతో కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగించామని పేర్కొన్నారు. ఈ తరహా హ్యాకింగ్ ను ఎదుర్కోవడానికి భద్రతా ప్రోటోకాల్లను డీజీసీఏ కఠినతరం చేసిందని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది జారీ చేసిన నిబంధనలు, 2025 నవంబర్ 10 నాటి నూనత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అసాధారణ జీపీఎస్ ప్రవర్తనను 10 నిమిషాల్లోపు నివేదించాలి.
జీపీఎస్ అంతరాయాల సమయంలో భారత్ సంప్రదాయ నావిగేషన్, నిఘా వ్యవస్థల ఆపరేటింగ్ నెట్వర్క్ను నిర్వహిస్తుందని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దిల్లీకి 60-నాటికల్-మైళ్ల దూరంలో ఎగురుతున్న విమానం నవంబర్లో ఒక వారం పాటు తీవ్రమైన జీపీఎస్ స్పూఫింగ్ ను ఎదుర్కొంది. తప్పుడు డేటాతో విమానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని విమానయాన శాఖ తెలిపింది.
పాకిస్తాన్, మయన్మార్తో భారత సరిహద్దుల సమీపంలో జీపీఎస్ స్పూఫింగ్ ఎక్కువగా కనిపిస్తుందని ఏటీసీ పేర్కొంది. కానీ రాజధానిపై ఇటువంటి కార్యకలాపాలు అసాధారణమైనవని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA), అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) వంటి సంస్థలు జీపీఎస్ స్పూఫింగ్ తో విమాన భద్రతకు ముప్పు పెరుగుతోందని హెచ్చరించాయి.
2021, 2024 మధ్య జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ కేసులు 220 శాతం పెరిగాయని IATA డేటా తెలియజేస్తుంది. పశ్చిమ రష్యా, ఉత్తర ఇరాక్లో వీటి హాట్స్పాట్లు ఉన్నాయి. భారత్ లో కూడా ఈ తరహా సంఘటనలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ విమానాయాన సంస్థలు వెల్లడించాయి. నవంబర్ 2023 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య సరిహద్దు ప్రాంతాలలో, ప్రధానంగా అమృత్ సర్, జమ్మూ ప్రాంతాల్లో 465 జీపీఎస్ జోక్యం కేసులు నమోదయ్యాయని, సగటున రోజుకు ఒక సంఘటన జరిగిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది.