ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి ట్రెక్కింగ్. భారతదేశంలో మొదటిసారి ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి అనువైన ఎన్నో అందమైన మార్గాలు ఉన్నాయి. ఈ ట్రెక్కులు దట్టమైన అడవులు, పచ్చిక బయళ్లు, మంచుతో కప్పబడిన పర్వతాలు, జలపాతాలతో ఆకట్టుకుంటాయి. కొత్తగా ట్రెక్కింగ్ ప్రారంభించే వారికి ఇవి మంచి అనుభవాన్ని అందిస్తాయి.
ఖీర్గంగా హిమాచల్ ప్రదేశ్లోని అత్యంత ప్రజాదరణ పొందిన ట్రెక్కుల్లో ఒకటి. ఈ మార్గం పైన్ అడవులు, చెక్క వంతెనలు, అందమైన జలపాతాల గుండా సాగుతుంది. ప్రయాణం మొత్తం స్వచ్ఛమైన పర్వత గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ట్రెక్ చివరలో సహజ వేడి నీటి ఊటలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. చుట్టూ కనిపించే హిమాలయ పర్వతాలు ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.
మొదటిసారి ట్రెక్కింగ్ చేసే వారికి త్రియుండ్ మంచి ఆప్షన్. ఈ మార్గం స్పష్టంగా ఉండటం వల్ల ప్రయాణం సులభంగా సాగుతుంది. దారిపొడవునా రోడోడెండ్రాన్ చెట్లతో నిండుగా ఉన్న అడవులు కనిపిస్తాయి. శిఖరానికి చేరుకున్న తర్వాత ధౌలాధర్ పర్వత శ్రేణుల అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. సాయంత్రం సూర్యాస్తమయం కూడా ఎంతో అందంగా ఉంటుంది.
శీతాకాలంలో ట్రెక్కింగ్ చేయాలనుకునే బిగినర్స్కు కేదార్కంఠ ట్రెక్ ప్రాంతం బాగుంటుంది. ఈ మార్గం దట్టమైన పైన్ అడవులు, ప్రశాంతమైన మైదానాల గుండా సాగుతుంది. చలికాలంలో మంచుతో కప్పబడిన ప్రకృతి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. శిఖరానికి చేరుకున్న తర్వాత 360 డిగ్రీల (అన్ని దిక్కుల్లోనూ) హిమాలయాల దృశ్యాలు మనసును హత్తుకుంటాయి.
దయారా బుగ్యాల్ భారతదేశంలోని అతిపెద్ద ఆల్పైన్ గ్రీనరీల్లో (పచ్చిక బయళ్లలో) ఒకటి. ఇక్కడ ట్రెక్కింగ్ బిగినర్స్తో పాటు కుటుంబ సభ్యులకు కూడా అనువుగా ఉంటుంది. వేసవిలో పచ్చని మైదానాలు కనువిందు చేస్తాయి. చలికాలంలో ఇవే ప్రాంతాలు మంచుతో కప్పబడి అద్భుతంగా కనిపిస్తాయి. గంగోత్రి పర్వత శ్రేణుల దృశ్యాలు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
చోప్తా చంద్రశిల చిన్నదైనా అద్భుతమైన ట్రెక్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ మార్గంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న తుంగనాథ్ శివాలయం ఉంటుంది. చివరి ఎక్కడం కొంత శ్రమతో కూడుకున్నప్పటికీ, శిఖరంపై కనిపించే హిమాలయ దృశ్యాలు ఆ కష్టాన్ని మరిపిస్తాయి.
దక్షిణ భారతదేశంలో కుద్రేముఖ్ ప్రముఖ ట్రెక్కింగ్ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ మార్గం పచ్చని కొండలు, గడ్డి మైదానాలు, దట్టమైన షోలా అడవుల గుండా సాగుతుంది. తరచూ కమ్ముకునే పొగమంచు ఈ ప్రాంతానికి ప్రత్యేక అందాన్ని ఇస్తుంది. గుర్రం ముఖాన్ని పోలిన పర్వత శిఖరం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
Also Read: వింత గ్రామం.. ఏదీ తాకకూడదు, గుడిలో ప్రవేశం నిషేధం, రాత్రి బసచేయకూడదు
సందక్ఫు భారతదేశంలో అత్యంత అందమైన సరిహద్దు ట్రెక్కుల్లో ఒకటి. ఈ మార్గం భారత్ – నేపాల్ సరిహద్దు సమీపంలో ఉంది. సాధారణ శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఈ ట్రెక్ను సులభంగా పూర్తి చేయవచ్చు. ఇక్కడి నుంచి కనిపించే ‘స్లీపింగ్ బుద్ధ’ పర్వత ఆకృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల్లో నాలుగు కూడా ఇక్కడి నుంచి కనిపిస్తాయి.
దేశంలోని ఈ ట్రెక్కులు సులభమైన మార్గాలు, అద్భుతమైన ప్రకృతి అందాలు, మరపురాని అనుభవాలు అందిస్తాయి. సరైన షూస్ ధరించడం, తగినంత నీరు తీసుకెళ్లడం, ముందుగా ప్లానింగ్ చేసుకోవడం ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. ఈ ట్రెక్కులు ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు భవిష్యత్లో మరిన్ని ట్రెక్కింగ్ సాహసాలకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి.