Delhi Bomb Blast: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన భయంకరమైన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉగ్రదాడి (Terror Attack) గా నిర్ధారించింది. ఈ దారుణమైన సంఘటనను కేంద్ర కేబినెట్ (Central Cabinet) అత్యవసరంగా సమావేశమై తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రవాద చర్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రివర్గం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
ఘటన తీవ్రత, విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని, కేబినెట్ సమావేశం మృతులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం, మంత్రివర్గం ఈ సంఘటనపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంలో.. 2025 నవంబర్ 10న ‘దేశ వ్యతిరేక శక్తులు’ కారు పేలుడు ద్వారా చేసిన ‘దారుణమైన ఉగ్రవాద సంఘటన’ను దేశమంతా చూసిందని పేర్కొంది. ఈ పేలుడు ఫలితంగా అనేక మంది మరణించారని.. అనేక మంది గాయపడ్డారని తీర్మానం స్పష్టం చేసింది.
మంత్రివర్గం ఈ ‘అర్థరహిత హింసాత్మక చర్య’ బాధితులకు తన ప్రగాఢ నివాళులు అర్పించింది. మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్న తెలియజేసింది. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కేబినెట్ ప్రార్థించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు చికిత్స అందించడంలో, సహాయక చర్యలు చేపట్టడంలో వేగంగా స్పందించిన వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బందిని, అత్యవసర సేవలను మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందించింది. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ ‘దుర్మార్గపు పిరికి చర్యను’ కేబినెట్ తీవ్రంగా ఖండించింది.
భారతదేశం భద్రత, స్థిరత్వంపై జరిగిన ఈ దాడికి నిబద్ధతను తెలియజేస్తూ.. ఉగ్రవాదానికి గట్టి బుద్ది చెబుతామని.. వ్యక్తీకర కట్టుబడి ఉంటామని మంత్రివర్గం పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి జరిగిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాల నుండి భారతదేశానికి అందిన సంఘీభావ, మద్దతు ప్రకటనలను కేబినెట్ అభినందించింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్యం, కరుణతో వ్యవహరించిన అధికారులు, భద్రతా సంస్థలు, పౌరుల సకాలంలో సమన్వయంతో స్పందించినందుకు మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. వారి అంకితభావం చాలా ప్రశంసనీయం అని పేర్కొంది.
ఈ దారుణమైన సంఘటనపై దర్యాప్తును అత్యంత అత్యవసరంగా వృత్తి నైపుణ్యంతో కొనసాగించాలని మంత్రివర్గం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ నేరస్థులు, వారికి సహకరించినవారు, వారి ఆచూకీని గుర్తించి, ఆలస్యం లేకుండా న్యాయం చేస్తామని మంత్రి వర్గం పేర్కొంది. ప్రస్తుతం.. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. జాతీయ భద్రత, ప్రతి పౌరుడి భద్రత పట్ల నిబద్ధతకు అనుగుణంగా, భారతీయుల జీవితాలను శ్రేయస్సును కాపాడాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని మంత్రివర్గం ఈ తీర్మానం ద్వారా బలంగా పునరుద్ఘాటించింది.
ALSO READ: Viral News: జస్ట్, ఇంట్లో ఉండి ఏడాదికి రూ.60 లక్షలు సంపాదిస్తున్న మహిళ, ఈమె తెలివికి జోహార్లు!