Supreme Court: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనల్లో పాల్గొని ఎఫ్ఐఆర్లు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జూలై 20 నుంచి 25 మధ్య నిరసనకారులపై నమోదైన కేసులన్నింటినీ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యార్థులపై పెట్టిన కేసులు ఈ ఉత్తర్వుతో రద్దవుతాయని స్పష్టం చేసింది. అయితే ఇదివరకు నేరచరిత్ర ఉన్నవారిపై నమోదైన కేసులకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదని పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం సైతం ఏకీభవించింది. విద్యార్థులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ నిరసనలకు సంబంధించి కొత్తగా ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని కోర్టుకు తెలియజేసింది. కాగా జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో తీవ్రమైన నేరచరిత్ర కలిగిన 2,873 మందిపై నమోదైన ఎఫ్ఐఆర్ పై విచారణ కొనసాగించేందుకు మాత్రం ఢిల్లీ పోలీసులకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఇదిలా ఉంటే ఢిల్లీతో పాటు బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేసులను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఇరువర్గాలు (కేంద్రం, నిరసనకారులు) నమ్మకంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలైనా పరిష్కారమవుతాయని అభిప్రాయపడింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘మేం శత్రువులం కాము. ఇరువైపులా ఎంతో సానుకూల దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరించుకున్నాం’ అని తెలిపారు. విద్యార్థి ప్రతినిధులకు జూలై 25న కేంద్రం హామీ ఇచ్చినట్లుగా కేసుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు మెహతా స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ సానుకూల వైఖరి, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమ ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు. అంతకుముందు విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం, చనిపోయిన అభ్యర్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ మార్చ్ నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు చొరవతో తమ కోరిక నెరవేరడంతో సెప్టెంబర్ 5 నిరసన మార్చ్ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు.
Also Read: వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
మరోవైపు నీట్ పరీక్ష రద్దు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. అయితే పరిహారానికి సంబంధించిన పూర్తి విధివిధానాల రూపకల్పన చేయడానికి మూడు నెలల సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ 3 నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Also Read: క్లియోపాత్రా అందానికి ప్రపంచమే ఫిదా.. ఇంతకీ ఆమె సౌందర్య రహస్యం ఏంటో తెలుసా?