Delhi Arrest: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన 9 మందిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ, ముంబయిలో వారు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో దిల్లీ, ముంబయి, పంజాబ్ లకు చెందినవారితో పాటు కొందరు విదేశీయులు సైతం ఉన్నట్లు దిల్లీ స్పెషల్ పోలీసు సెల్ వెల్లడించింది. వారి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
నిందితులు టార్గెట్ చేసిన జాబితాలో అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ‘నిందితులు పాక్ ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్లో ఉన్నారు. దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ సహాయంతో భారత్లోకి నిధులు, పేలుడు పదార్థాలను చేరవేసేందుకు వీరు ప్రయత్నించారు’ అని దిల్లీ స్పెషల్ సెల్ కు చెందిన ఉన్నతస్థాయి పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
దేశ రాజధాని దిల్లీకి ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందంటూ కొద్ది రోజుల క్రితమే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆత్మాహుతి దాడులు, వాహనాల ముసుగులో ఐఈడీ పేలుళ్లు, కాల్పులు వంటి జరగొచ్చని సూచించాయి. దిల్లీలోని ప్రముఖ ఆఫీసులు, రద్దీ ప్రాంతాలను ముష్కరులు లక్ష్యంగా చేసుకోవచ్చని ఈ నెల ప్రారంభంలో హెచ్చరికలు జారీ చేశాయి. కాబట్టి భద్రతా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పారా మిలటరీ బలగాలతో పహారాను మరింత పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలోనే పాక్ తో సంబంధాలు ఉన్న 9 మందిని తాజాగా భద్రతా బలగాలు అరెస్ట్ చేయడం గమనార్హం.
Also Read: ఒడిశాలో ఘోర ప్రమాదం.. కారును 600 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. వీడియో వైరల్!
ఇదిలా ఉంటే గతేడాది నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇటీవలే మే 14న ఎన్ఐఏ అధికారులు తొలి ఛార్జ్ షీటును ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు. 7,500 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జ్ షీట్ లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్ బిన్ నబీతోపాటు మొత్తం 11మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహమద్ మొహియుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నాడు. దర్యాప్తులో భాగంగా 588మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. 395కు పైగా డాక్యుమెంట్లు, 200కు పైగా సీజ్ చేసిన పరికరాల నుంచి సాక్ష్యాలను సేకరించారు.
Also Read: గుంపు మేస్త్రీపై పోరాటానికి.. ప్రజలు సిద్ధం కావాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు