Kalvakuntla Kavitha: తెలంగాణలో అధికారంలోకి వస్తే రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన 111 జీవోను రద్దు చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మెయినాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కవిత మాట్లాడారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పుట్టుకొచ్చిందని అన్నారు. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పోతాయని భావించామని.. కానీ అది జరగలేదని కవిత పేర్కొన్నారు. ఆ లక్ష్యాలను సాధించుకొని తెలంగాణ హక్కులను తమ పార్టీ పరిరక్షిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.
మెుయినాబాద్ ప్రాంతంలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలుకుతోందని కవిత అన్నారు. అయితే ఇక్కడి 120 గ్రామాలకు సంబంధించిన 111 జీవోను ఎత్తివేస్తే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం ఒక పావు ఎకరం అమ్ముకున్న మంచి ధర వచ్చే పరిస్థితి ఉంటుందని అన్నారు. 111 జీవోను ఎత్తివేస్తామని ఇప్పటికే చాలా పార్టీలు వాగ్దానం చేశాయన్న కవిత.. వారు అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకున్న పాపాన పోలేదని అన్నారు.
భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సేన కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కవిత దీమా వ్యక్తం చేశారు. తాము 111 జీవో ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. మెయినాబాద్ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారన్న కవిత.. గుంపు మేస్త్రీ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారమే తనకు తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సైతం ఊడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గుంపు మేస్త్రీపై పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని కవిత అన్నారు.
చేవెళ్ల, మెయినాబాద్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మరోవైపు తమ పార్టీలోకి పెద్ద ఎత్తున మైనార్టీలు చేరారని కవిత తెలిపారు. వాళ్ల చేరికతో పార్టీ మరింత బలపడిందని చెప్పారు. ఇక్కడున్న గంగా, జమునా, తెహజీబ్ సంస్కృతిని చెడగొట్టే వాళ్లకు సరైన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ వస్తే ఆడబిడ్డల జీవితాలు మారుతాయని అనుకున్నామని కానీ అలా జరగలేదని కవిత అన్నారు. ఆడబిడ్డలకు కచ్చితంగా మంచి చేసేందుకే తాను ఈ పార్టీ పెట్టానని స్పష్టటం చేశారు. ఒక ఆడబిడ్డగా ఆడవారి సమస్యలు అన్ని తనకు తెలుసని అన్నారు.
Also Read: జియో యూజర్లకు షాక్.. మాయమైన బడ్జెట్ ప్లాన్లు.. అసలేం జరిగిందంటే?
మరోవైపు యువతకు గురించి ప్రస్తావిస్తూ.. వారికి ఉద్యోగాలు లభించే విధంగా కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. ‘మన యువతకు కూడా ఉద్యోగాలు రావాల్సి ఉంది. కచ్చితంగా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. అప్పుడు యువతకు అవసరమైన ఉద్యోగాలు కల్పిస్తాం. ఎలాంటి గ్యారంటీ లేకుండా వారికి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు అందిస్తాం’ అని కవిత హామీ ఇచ్చారు.
Also Read: అసలేంటీ ‘స్టార్ రేటింగ్’ కథ? కరెంటు బిల్లుకు దానికి లింకేంటి? తప్పక తెలుసుకోవాల్సిందే!