Egg Prices Hike: సామాన్యుడి తినే గుడ్డుకు గడ్డు కాలం మొదలైనట్టే కనిపిస్తోంది. రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారు అని డాక్టర్లు సలహా ఇస్తున్నా, పెరిగిన ధరలతో గుడ్డు కొనడం కూడా సామాన్యులకు భారంగా మారుతోంది. ముఖ్యంగా ఉడికించిన గుడ్డు తినడాన్ని నిత్య అలవాటుగా చేసుకున్న ఎగ్ ప్రియులు ప్రస్తుతం ధరలు చూసి ఉసూరుమంటున్నారు.
ఇక కోళ్ల రైతులకు మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నష్టాలతో సతమతమవుతున్న కోళ్ల పరిశ్రమకు.. ఈ ఏడాది గుడ్డు ధరలు ఊరటనిచ్చాయి. కోళ్ల ఫారం వద్ద గుడ్డు ధర ఏకంగా రూ.6.75 పైసలకు చేరడంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సరైన ధరలు లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతులకు.. ఇది కొంత ఊరట కలిగించే పరిణామంగా మారింది.
రిటైల్ మార్కెట్లో సాధారణంగా రూ.5 నుంచి రూ.6 మధ్యలో దొరికే గుడ్డు.. ప్రస్తుతం రూ.8 వరకు పలుకుతోంది. దీంతో వినియోగదారుడు గుడ్డు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో గుడ్డు వినియోగం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
గత ఐదేళ్లుగా కోళ్ల పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తోంది. గుడ్డు ఒక్కటి ఉత్పత్తి చేయడానికి సగటున రూ.5 వరకు ఖర్చవుతుండగా, సీజన్లో కూడా ధర కష్టపడి రూ.6కు చేరుకుని వెంటనే పడిపోవడంతో.. రైతులు భారీ నష్టాలను చవిచూశారు. గతేడాది బర్డ్ ఫ్లూ ప్రభావం కూడా కోళ్ల పరిశ్రమపై తీవ్రంగా పడింది. వ్యాధి భయంతో రైతులు తమ ఫారాల్లో కోళ్ల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. సాధారణంగా లక్ష కోళ్లు ఉండాల్సిన ఫారంలో ప్రస్తుతం 60 నుంచి 70 శాతం మాత్రమే ఉండటంతో ఉత్పత్తి భారీగా తగ్గింది.
రైతుల అంచనా ప్రకారం.. కోళ్ల సంఖ్యలో 30 నుంచి 40 శాతం తగ్గుదల నమోదైంది. దీని ప్రభావంతో గుడ్డు ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణంగా రూ.1.30 కోట్ల కోళ్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం రూ.90 లక్షల కోళ్లు మాత్రమే ఉన్నాయి. రోజుకు దాదాపు కోటి గుడ్లు ఉత్పత్తి కావాల్సిన చోట, ప్రస్తుతం 65 నుంచి 70 లక్షల గుడ్లు మాత్రమే మార్కెట్కు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
సాధారణంగా చలికాలంలో గుడ్డు వినియోగం పెరగడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో గుడ్డు డిమాండ్ భారీగా పెరిగింది. అదే సమయంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. డిసెంబరు ప్రారంభం వరకు రూ.6కే పరిమితమైన గుడ్డు ధర కేవలం 15 రోజుల్లోనే మరో 0.75 పైసలు పెరిగిందని రైతులు చెబుతున్నారు.
ఈ ధరలు జనవరి నెలాఖరు వరకు కొనసాగితే తమకు కొంత మేలు జరుగుతుందని.. కోళ్ల రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గుడ్డు ధర రూ.6.75 పలికినా, కమీషన్లు పోగా తమకు మిగిలేది రూ.6.50 మాత్రమేనని రైతులు వాపోతున్నారు. ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇది పెద్ద లాభం కాదని వారు అంటున్నారు.
Also Read: ప్రేమకోసం ఇస్లాంలోకి.. పాక్ అనుకూల నినాదాలతో హల్చల్.. యువకుడు అరెస్ట్
మొత్తానికి ఒకవైపు రైతులకు ఊరటగా ఉన్న గుడ్డు ధరలు, మరోవైపు వినియోగదారులకు భారంగా మారాయి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే గుడ్డు బహిరంగ మార్కెట్లో రూ.8కు చేరడంతో సామాన్యులు నిరుత్సాహపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోళ్ల పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తే రైతులు, వినియోగదారులు ఇద్దరికీ మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Story BY స్టాఫ్ రిపోర్టర్: శివ సాగర్, బిగ్ టీవీ