బీఆర్ఎస్ సీనియర్లకు నిన్న రాత్రి నుంచి నిద్ర కరువైనట్లు తెలుస్తున్నది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే కారణమని తెలుస్తున్నది. ఎందుకుంటే ఆయన పేల్చిన బాంబ్ అటువంటిది. మొన్నటివరకు పంచాయతీ ఎన్నికల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం కేబినెట్ మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల గుండెల్లో వణుకుపుట్టేలా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇన్నిరోజులు మీడియా ముందు బీరాలకు పోయిన వారంతా ఇప్పుడు భయంతో వణుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకు సీఎం రేవంత్ చేసిన అంత పెద్ద ప్రకటన ఏంటి?
మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్న కవిత.. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బయటకు రావడానికి కొన్ని శక్తులు ఉన్నాయని బహిరంగంగా ఆరోపించారు. ఆమె తన తండ్రికి రాసిన లెటర్ బయటకు లీక్ కావడానికి, తన భర్త ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తులపై యుద్ధం తప్పదని ప్రకటించారు. ఇప్పటికే పలువురికి వార్నింగ్ సైతం ఇచ్చారు. దీనికి తోడు బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల భూములు కబ్జాకు గురయ్యాయని, అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవిత ఆరోపణలపై సీఎం తొలిసారిగా స్పందించారు. కవిత అంత బలంగా ఆరోపిస్తున్నందున విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం అవ్వగానే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు చాలా మంది ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. వీరంతా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంపై విరుచుకుపడిన వారే. ముఖ్యంగా మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి.. ప్రస్తుతం ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. ఇటీవల కవిత మేడ్చల్ పర్యటనలో భాగంగా మల్లారెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మల్లారెడ్డి వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని, దీనిపై విచారణ జరిపించాలని ఆరోపించారు. కవిత లిస్టులో ఒక్క మల్లారెడ్డి మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది మాజీ మంత్రులు, గులాబీ సీనియర్లు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు టాక్.
కవిత ఆరోపణలను బేస్గా చేసుకుని ప్రభుత్వం విచారణ జరిపితే వారంతా గత ప్రభుత్వంలో పాల్పడ్డ అవినీతిపై నిజం ఒప్పుకుంటారా? చట్టం లోని లొసుగులను అడ్డుపెట్టుకుని తప్పించుకుంటారా? అని ప్రస్తుతం చర్చ జరుగుతున్నది.అందుకే ఈ మధ్య చాలా మంది బీఆర్ఎస్ సీనియర్లు ఆమెను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మొన్నటివరకు సైలెంట్గా ఉన్న వారంతా.. తమ అవినీతి, భూ కబ్జా బాగోతాలను ఆమె ఎక్కడ బయటపెడుతుందేమో అన్న భయంతో వారంతా ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే కవిత..మాజీ మంత్రి హరీశ్ రావు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. వాటిని ప్రభుత్వానికి అందజేసి వారిపై విచారణకు సహకరిస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది.అదే జరిగితే రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి వ్యతిరేకత మరింత తీవ్రం కానుంది.