India Oil Reserves: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ఇంధన భద్రతపై భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ.. భారత్ వద్ద 60 రోజులకు సరిపడా నిరంతరాయ చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని.. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని భరోసా ఇచ్చింది.
మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ ప్రస్తుతం 74 రోజుల పాటు చమురును నిల్వ ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలు సుమారు 60 రోజుల వరకు దేశ అవసరాలను తీర్చగలవు. దేశంలోని ప్రతి రిఫైనరీ ప్రస్తుతం 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో నడుస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా వచ్చే చమురుపైనే కాకుండా.. రష్యా, అమెరికా వంటి ఇతర దేశాల నుంచి భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతున్నా మన సరఫరా గొలుసు దెబ్బతినలేదు.
కేవలం 6 రోజులకు మాత్రమే నిల్వలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని.. ప్రతి భారత పౌరునికి వచ్చే రెండు నెలల పాటు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ప్రజలు భయాందోళనతో ముందస్తు బుకింగ్లు చేయవద్దని అధికారులు కోరారు.
మరోవైపు గ్యాస్, పెట్రోల్ కొరత రాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా విశాఖపట్నం పోర్టుకు భారీగా ఇంధన నౌకలు చేరుకుంటున్నాయి. నేడు విశాఖ పోర్టుకు క్రూడ్ ఆయిల్ షిప్స్ చేరుకున్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా మరింత మెరుగుపడనుంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ లోడ్తో కూడిన షిప్లు భారత్కు వస్తున్నాయి. రేపు విశాఖ పోర్టుకు మరో రెండు ఎల్పీజీ గ్యాస్ షిప్స్ రానున్నట్లు సమాచారం. ఇవి చేరుకోవడంతో హోటళ్లు, గృహ అవసరాలకు ఎదురవుతున్న గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.
Read Also: Petrol Diesel Price Hike: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచిన నయారా ఎనర్జీ