Jammu Kashmir Snowfall: జమ్మూ కశ్మీర్ ను మంచు దుప్పటి కమ్మేసింది. కశ్మీర్లో మంచు కురుస్తున్న కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టును విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల పదుల సంఖ్యలో విమానాలు రద్దు చేయబడినట్లు అధికారులు తెలిపారు.
బారాముల్లా మంచుతో తెల్లటి దుప్పటిగా దర్శనమిస్తుంది. తాజా హిమపాతంతో దోడా నగరంలో పర్వతాలు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. శ్రీనగర్ లో గరిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తాజా హిమపాతంతో అనంతనాగ్లో చెట్లు, ఇళ్లను మంచు కమ్మేసింది. భారీగా మంచు కురవటం వల్ల వాహన దారులు, జమ్ము కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో శ్రీనగర్ ఎయిర్ పోర్టులో విమానాలు రద్దు చేశారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటివరకు 50 విమానాలు రద్దు అయ్యాయి. నాలుగు విమానాల రాకపోకలను రీషెడ్యూల్ చేశారు. మంచు తుపాను కారణంగా ఆ విమానాలు కూడా నడిచే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
Also Read: కాశ్మీర్ మంచు ఢిల్లీలో అమ్మకం, ఆ కుర్రాడి ఆలోచన మామూలుగా లేదు, వీడియో వైరల్
విమానాలు రద్దైన కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు సూచించారు. లాంగ్ వీకెండ్ సెలవులతో కశ్మీర్ వచ్చిన టూరిస్టులు తిరిగి వెళ్లేందుకు మార్గం లేక ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. విమాన రాకపోకలపై ప్రయాణికులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు కోరారు. విమానాల రద్దుతో వందలాది మంది పర్యాటకులు కశ్మీర్ లో చిక్కుకుపోయారు. మంచు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో విమానాలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై స్పష్టత లేదు. రోడ్డు మార్గాలు కూడా మంచుతో నిండిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.