Bengaluru Politics: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు హైడ్రామా నడిచింది. ప్రభుత్వం రెడీ చేసిన ప్రసంగం చదవకుండానే గవర్నర్ గెహ్లాట్ కేవలం రెండు లైన్లు చదివి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై సిద్ధరామయ్య సర్కార్ మండిపడింది. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యగా వర్ణించారు ముఖ్యమంత్రి.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా
కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్గా గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు అసెంబ్లీలో వివాదం చెలరేగింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని కేవలం రెండు మాటల్లో ముగించారు. ఆ తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య ప్రభుత్వం రాసిన ప్రసంగాన్ని ఆయన చదవలేదు.
దీంతో గవర్నర్ తీరుపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు సరైన నిర్ణయమేనని సమర్థించుకున్నారు. గతంలో తమిళనాడు, కేరళ ఆ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. ఆ జాబితాలోకి ఇప్పుడు కర్ణాటక చేరిపోయింది.
రెండు లైన్లలో గవర్నర్ స్పీచ్, అధికార పార్టీ ఆగ్రహం
గవర్నర్ తన ప్రసంగంలో ‘ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోందని.. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి రాజ్భవన్కు వెళ్లిపోయారు. గవర్నర్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక చర్యగా వర్ణించారు సీఎం సిద్ధరామయ్య.
గడిచిన రెండేళ్లు గవర్నర్ థావర్చంద్ తయారు చేసిన ప్రసంగాలను ఉభయ సభల్లో చదివారు. ఈసారి ఆయన తన రూటు మార్చినట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ప్రసంగాన్ని సిద్ధం చేసిన తీరుని ఆయన ముందుగా ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తారా? అనేదానిపై ఉత్కంఠ రేగింది.
ALSO READ: జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్..మృతుల్లో కీలక నేతలు
మరి ఏం జరిగిందో తెలీదుగానీ, సభకు వచ్చిన ఆయనను సీఎం సిద్ధరామయ్య ఆహ్వానించారు. గవర్నర్ కేవలం రెండులైన్లు మాత్రమే చదివి సభ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో గవర్నర్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని సిద్దరామయ్య సర్కార్ ప్లాన్ చేస్తోంది. క్యాబినెట్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవకుండా ముందుంగా రెడీ చేసిన ప్రసంగాన్ని గవర్నర్ చదివారు. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ వ్యవహరించలేదంటూ నిరసన తెలిపారు అధికార పార్టీ సభ్యులు. ఈ అంశంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించాలా? లేదా అనేది పరిశీలిస్తున్నామని సీఎం సిద్ధరామయ్య అన్నారు.