Social Media Ban Relaxed: దేశ రక్షణ బాధ్యతల్లో నిమగ్నమైన భారత సైనికులకు (Indian Army Soldiers) కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత కొన్నేళ్లుగా సైనికులు, సైనికాధికారుల సోషల్ మీడియా వినియోగంపై ఉన్న కఠిన నిషేధాన్ని ప్రభుత్వం పాక్షికంగా సడలించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్ (DGMI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, ఈ సడలింపులు కేవలం సోషల్ మీడియాను “చూడటానికి” (Passive Usage) మాత్రమేనని, అందులో చురుగ్గా పాల్గొనడానికి కాదని స్పష్టం చేసింది.
తాజా నిబంధనల ప్రకారం.. సైనికులు ఇకపై ఫేస్బుక్ (Facebook), ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ (Instagram) వంటి యాప్లను తమ ఫోన్లలో వాడుకోవచ్చు. అయితే, వారు కేవలం ఇతరుల పోస్టులను చూడటానికి, వార్తలు చదవడానికి, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి (Situational Awareness) మాత్రమే వీటిని ఉపయోగించాలి.
సైనికులు తమ వ్యక్తిగత ఖాతాల నుంచి ఎలాంటి ఫోటోలు, వీడియోలు లేదా సమాచారాన్ని పోస్ట్ చేయకూడదు.
ఇతరుల పోస్టులకు కామెంట్స్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం వంటివి కూడా పూర్తిగా నిషేధమే.
యూట్యూబ్, ఎక్స్, కోరా (Quora) వంటి ప్లాట్ఫామ్లను కేవలం సమాచారాన్ని తెలుసుకునేందుకు మాత్రమే వినియోగించాలి.
ఇన్స్టాగ్రామ్ను కేవలం రీల్స్ లేదా ఫోటోలు చూడటానికి మాత్రమే వాడాలి.
ఇక మెసేజింగ్ యాప్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వినియోగంపై కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సైనికులు తమకు వ్యక్తిగతంగా తెలిసిన వారు, కుటుంబ సభ్యులతో మాత్రమే చాటింగ్ చేయాలి. తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, అనుమానాస్పద గ్రూపుల్లో జాయిన్ అవ్వడంపై నిషేధం యథాతథంగా కొనసాగుతుంది. ఇతర డిజిటల్ కార్యకలాపాలపై గతంలో ఉన్న భద్రతా నియమాలు (Cyber Security Protocols) కఠినంగానే అమలులో ఉంటాయని మిలటరీ ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచారం వేగంగా మారుతోంది. సైనికులు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, పర్యవేక్షణకు సోషల్ మీడియా అవసరమని భావించి ఈ సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
2020లో గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత, హనీ ట్రాప్ (Honey Trap) ముప్పులు, గూఢచర్యం (Espionage) భయాలతో కేంద్రం సైన్యంపై కఠిన ఆంక్షలు విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా దాదాపు 89 యాప్లను సైనికులు తమ ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని అప్పట్లో ఆదేశించింది. డేటా లీకేజీని అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే, ఐదేళ్ల తర్వాత పరిస్థితులను సమీక్షించి, ఇప్పుడు కొన్ని షరతులతో కూడిన వెసులుబాటును కల్పించారు.
READ ALSO: Tamilnadu News: భార్యకి రెడ్ హ్యాడెండ్గా చిక్కిన భర్త.. కత్తితో మర్మాంగం కట్, తమిళనాడులో దారుణం