Ponnam Prabhakar: కరీంనగర్ జిల్లా రేణుకుంట ప్రాంతంలో ఉన్న లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్వాటర్ వద్ద.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పూడికతీత పనులను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా జరుగుతున్న ఇసుక క్వారీలు, పూడికతీత పనుల తీరును ప్రత్యక్షంగా వీక్షించిన నేతలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డ్యామ్లు, ప్రాజెక్టులలో పేరుకుపోయిన పూడిక కారణంగా.. వాటి నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యామ్లు పూడికతో నిండిపోయి, పూర్తిస్థాయి నీటి కెపాసిటీని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
రైతులకు సాగునీరు సమృద్ధిగా అందించాలంటే.. ప్రాజెక్టుల అసలు సామర్థ్యాన్ని తిరిగి సాధించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. అందుకే ఆధునాతన సాంకేతికతను వినియోగిస్తూ పూడికతీత పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇసుక, మట్టి వేరు చేసే విధానం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని అధికారులు వివరించారని తెలిపారు.
పూడికతీత ప్రక్రియ ఎలా సాగుతోందో, వాడుతున్న యంత్రాలు ఎలా పని చేస్తున్నాయో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు.. తామంతా వచ్చామని మంత్రి వివేక్ వెంకట్ స్వామి అన్నారు. గతంలో సంప్రదాయ పద్ధతుల్లో చేసిన పూడికతీత పనులు పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఆధునాతన టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నూతన సాంకేతికత ద్వారా ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు.. మళ్లీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. పూడికను పూర్తిగా తొలగించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, సాగునీటి లభ్యత మెరుగవుతుందని చెప్పారు. ఇది రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూర్చే కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో పూడికతీతను ఇసుక వ్యాపారంగా మాత్రమే చూసే పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చిందని, ఇసుకను వ్యాపారంగా కాకుండా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా కేటాయించనుందని స్పష్టం చేశారు. ఇల్లు నిర్మించుకునే సామాన్య ప్రజలకు, అభివృద్ధి పనులకు అవసరమైనవారికే నామమాత్ర ధరలకు ఇసుకను అందించే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
పూడికతీత ద్వారా ఒకవైపు ప్రాజెక్టుల కెపాసిటీ పెరిగి సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుండగా, మరోవైపు వరదల సమయంలో నీటిని నియంత్రించే సామర్థ్యం కూడా మెరుగవుతుందని అధికారులు వివరించారు. ఇది రాష్ట్రంలోని నీటి వనరుల నిర్వహణకు దీర్ఘకాలిక పరిష్కారంగా మారుతుందని పేర్కొన్నారు.
Also Read: ఐఏఎస్లు వ్యవస్థకు పట్టిన దరిద్రం.. కూతురి పెళ్లికి రూ.1000 కోట్ల కట్నం! దీపక్రెడ్డి సంచలనం
ఈ కార్యక్రమం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని, తెలంగాణలోని ఇతర ప్రధాన ప్రాజెక్టులలోనూ ఇదే తరహా సాంకేతికతను అమలు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. సాగునీటి భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రాజెక్టుల పునరుజ్జీవనమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.