Delhi Politics: బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చినట్టేనా? బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నితిన్ నబీన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ని హైకమాండ్ నియమించిందా? నితిన్ నబీన్ కాకుండా మరో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు రానున్నారా? బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.
బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా?
బీజేపీ తీసుకునే నిర్ణయాలు వెరైటీగా ఉంటాయి. నాయకులు ఒకటి అనుకుంటే.. హైకమాండ్ విధానం మరోలా ఉంటుంది. లేటెస్ట్గా బీహార్కు చెందిన నితిన్ నబీన్ సిన్హాను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది బీజేపీ. ఆయనెవరు? ఆయన గురించి డీటేల్స్ తెలుసుకుందాం.
1980 మే 23న రాంచీలో జన్మించారు నితిన్ నబీన్సిన్హా. ఆయన విద్యాభ్యాసం ఢిల్లీలో పూర్తి చేశారు. ఐదుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ప్రస్తుతం నితీష్ కుమార్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
నితిన్ నబీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెనుక వ్యూహం?
నితిన్ నబీన్.. కాయస్థ సామాజిక వర్గానికి చెందినవారు. అంతేకాదు ఆరెస్సెస్ నేపథ్యం ఆయన సొంతం. బీహార్లోని బాంకీపుర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సినీనటుడు శతృఘ్నసిన్హా కొడుకు లవ్సిన్హాపై గెలుపొందారు. గతంలో యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు నితిన్ నబీన్.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. నితిన్ తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా బీజేపీలో నేతగా గుర్తింపు పొందారు. అయితే రెండు దశాబ్దాల కిందట తండ్రి మరణంతో.. నితిన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.
2006లో జరిగిన బైపోల్లో తొలిసారి గెలిచిన ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆనాటి నుంచి నేటివరకు ఎన్నడూ ఓటమి చూడలేదు. రాష్ట్రాల్లో తప్పిస్తే జాతీయస్థాయిలో బీజేపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నియామకం ఇది రెండోసారి. జేపీ నడ్డా తొలుత ఆ విధంగా అవకాశం ఇచ్చింది పార్టీ. ఆ తర్వాత ఆయన పదవీకాలం పొడిగిస్తూ వచ్చింది.
ALSO READ: ఉగ్రవాదాన్ని సహించేది లేదు.. సిడ్నీ ఘటనపై మోదీ రియాక్షన్
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిన్హాను తెరమీదకు బీజేపీ తెచ్చినట్లు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న బాధ్యతలు చేపట్టనున్నారు. చిన్నవయసులో పార్టీ పగ్గాలు చేపట్టిన వారిలో ఆయనది ఫస్ట్ ప్లేస్. అంతేకాదు బీహార్ నుంచి బీజేపీలో ఆ స్థాయికి ఎదిగిన నేతల్లో ఒకరు.
ప్రస్తుతం బెంగాల్లో ప్రతిపక్షంగా కొనసాగుతోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ పీఠాన్ని అందుకోవాలని ఆలోచన చేస్తోంది. ఆ రాష్ట్రానికి పొరుగునున్న వ్యక్తిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించడం ఒకటైతే, పార్టీ నుంచి సానుకూల పవనాలు వీస్తాయని భావిస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నితిన్కు పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు.
ఆయన విజయం సాధిస్తే.. పార్టీ హైకమాండ్ అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఆ పార్టీలో కొందరు నేతల మాటలు మరోలా ఉన్నాయి. తూరు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుంచి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు తీసుకోవాలని ఆలోచన చేస్తోందట.
అందులో భాగంగానే తూర్పు వైపు బాధ్యతలు నితిన్కు అప్పగించారని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మొత్తానికి పార్టీని నమ్ముకున్న నేతల్లో ఏ మాత్రం విశ్వాసం సన్నగిల్లదని అంటున్నారు. మరో రెండు దశాబ్దాలపాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలన్నది ఆలోచనగా చెబుతున్నారు.