Jabalpur Boat Tragedy: మధ్యప్రదేశ్ నర్మదా నదిపై ఉన్న బర్గీ డ్యామ్ క్రూయిజ్ విషాదాంతం అయింది. క్రూయిజ్ బోటు మునిగిన ఘటనలో 28 మందిని రక్షించగా, ఇప్పటి వరకూ 9 మంది మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జలాశయంలో విపరీతమైన గాలులకు బోటు ఒకపక్కకు ఒరిగిపోగా.. బోటులోకి మోకాళ్ల లోతులో నీళ్లు చేరాయి. దీంతో పర్యాటకులు భయాందోళనతో హాహాకారాలు చేస్తున్నారు. బోటు సిబ్బంది హడావుడిగా లైఫ్ జాకెట్లు పంచుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. బోటు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఈ వీడియోలతో మరోసారి స్పష్టమవుతుంది.
ఆ వీడియోలో టూరిస్టులు.. క్రూయిజ్ బోటు లోపల కూర్చుని ఉండగా, అకస్మాత్తుగా బోటులోకి నీరు వేగంగా వస్తుంది. దీంతో బోటు ఒక పక్కకు ఒరిగిపోయింది. అప్పటి వరకూ కేరింతలు కొట్టినవాళ్లంతా కేకలు పెట్టారు. భారీ గాలులతో బోటు కుదుపులకు గురై ఒక పక్కకు ఒరిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. బోటు మునిగిపోవడం మొదలైన తర్వాతే క్రూయిజ్ సిబ్బంది హడావుడిగా లైఫ్ జాకెట్లను విప్పుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోలో చాలామంది లైఫ్ జాకెట్లు లేకుండానే కనిపించారు. బోటు నిర్వాహకులు ప్రాథమిక భద్రతా నిబంధనలను పాటించలేదని, తుపాను మధ్యలో టూరిస్టుల ప్రాణాలతో చెలగాటం ఆడారని ప్రాణాలతో బయటపడిన వాళ్లు ఆరోపిస్తున్నారు.
🚨 ANOTHER VIDEO
Boat capsizes at Bargi Dam in Jabalpur; 9 dead, several missing after sudden storm, rescue operations ongoing.#BreakingNews #Jabalpur #India #MadhyaPradeshNews https://t.co/sNbvf79iQn pic.twitter.com/KSC8kYEO77
— Public News X (@PublicNewsX) May 1, 2026
కేవలం 29 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్లు జారీ చేసినప్పటికీ, ఆ క్రూయిజ్లో 40 మందికి పైగా టూరిస్టులను బోటు ఎక్కించారు. గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, తీవ్రమైన వాతావరణం, తుపాను పరిస్థితుల గురించి హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ బోటు నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. కిక్కిరిన బోటును బర్గీ డ్యామ్ జలాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలను వెలికితీయగా… ముగ్గురు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శుక్రవారం సాయంత్రం గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. శనివారం ఉదయం 5 గంటలకు సహాయక బృందాలు తిరిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రాణాలతో బయటపడిన వారిలో 72 ఏళ్ల రియాజ్ హుస్సేన్ ఉన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు తాను నీటిలోనే ఉన్నట్లు తెలిపారు. పడవ ప్రమాదకరంగా ఒకవైపుకు వంగిపోవడంతో, ప్రయాణికులు దాదాపు అరగంట పాటు భయంతో అటూ ఇటూ పరుగులు తీశారన్నారు.
మరీనా మాస్సే, ఆమె నాలుగేళ్ల కుమారుడు త్రిషాన్ మృతదేహాలను వెలికితీసినప్పుడు.. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని దృశ్యాలు చూపరులను కన్నీళ్లు పెట్టించాయి. ఆమె భర్త ప్రదీప్ మాస్సే ప్రాణాలతో బయటపడ్డారు. బోటు నిర్వాహకులు కూర్చోమని చెప్పారని, లైఫ్ జాకెట్లు గానీ, మరే ఇతర సహాయం గానీ చేయలేదన్నారు. తనకు అకస్మాత్తుగా ఒక ట్యూబ్ దొరకడంతో.. ప్రాణాలతో బయటపడి ఒడ్డుకు చేరుకోగలిగానని చెప్పారు. ఒడ్డునున్న వారు తాడులు విసిరి తమను రక్షించారన్నారు.
సహాయక బృందాలకు సాయంత్రం 6.15 గంటలకు కాల్ రాగా, సహాయక బృందం 6.40 గంటల వరకు బయలుదేరలేదనే ఆరోపణలు ఉన్నాయి. వారి వాహనం స్టార్ట్ కాలేదని ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో రెస్క్యూ పరికరాలను మరో వెహికల్ లోకి మార్చవలసి వచ్చిందని జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. రెండో సహాయక బృందం రాత్రి 7 గంటల ప్రాంతంలో బయలదేరడంతో.. అప్పటికే భారీగా ప్రాణం నష్టం సంభవించింది.
Also Read: యూపీలో ఘోరం.. నదిలో పడవ బోల్తా, ఎనిమిది మంది మృతి!
ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక జాలర్లు, మత్య్సకారులు 15 మందిని రక్షించారు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా అన్ని క్రూయిజ్, మోటార్ బోటు సేవలు, వాటర్ స్పోర్ట్స్ను నిలిపివేయాలని సీఎం మోహన్ యాదవ్ ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన క్రూయిజ్ సిబ్బందిని విధుల్లోంచి తప్పించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.