Rahul Vs PM Modi: లోక్సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ వీడిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచన పడింది. దీని విషయంలో వెనుక అడుగు వేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ భగ్గుమంది. అదే స్థాయిలో ఎదురుదాడి తీవ్రతరం చేసింది.
శనివారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ఫైర్
శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం చేశారు. ఆయన స్పీచ్పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది. ఆయన చేసే ప్రసంగానికి ఒక పవిత్రత ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. జాతీయ సంకల్పాన్ని, విశ్వాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేసే నిష్పక్షపాత ప్రసంగమై ఉండాలన్నారు.
జాతీయ ప్రసంగంలా కాకుండా ఒక ఆపద ప్రసంగంలా ఉందని, దీన్ని దయనీయమైనదిగా వర్ణించారు. వాదనా పూరిత దాడి ఒక పత్రికా సమావేశంలో చేసి ఉంటే మరింత సముచితంగా ఉండేదన్నారు. ప్రధానికి దమ్ముంటే ప్రస్తుతం లోక్సభలో సంఖ్యాబలం ఆధారంగా మహిళా రిజర్వేషన్లు కల్పించాలని సవాల్ విసిరారు.
ప్రధాని సంకల్పం స్వచ్ఛమైనది కాదు, విషపూరితమంటూ జైరాం రమేష్ వ్యాఖ్యలు
తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ పేరును 59 సార్లు ప్రస్తావించారన్నారు. లోక్సభలో బిల్లు వీగిపోయినందుకు మహిళలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను బలవంతంగా ఆమోదింప జేయడానికి చేసిన సిగ్గుమాలిన, మోసపూరిత ప్రయత్నాలకు బ్రేక్ పడిందన్నారు. ఆయన సంకల్పం స్వచ్ఛమైనది కాదని, అది విషపూరితమైనదని వ్యాఖ్యానించారు.
2023 సెప్టెంబరులో ఏకగ్రీవంగా ఆమోదించబడిన నారీ శక్తి వందన అధినియమ్ బిల్లును 30 నెలల ఆలస్యం తర్వాత 2026 ఏప్రిల్ 16న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎందుకు నోటిఫై చేశారని ప్రశ్నించుకోవాలన్నారు. ప్రధాని ప్రవర్తించిన తీరు చూస్తే.. మహిళా సమ్మాన్ గురించి మాట్లాడటం పచ్చి కపటత్వమని అన్నారు. లోక్సభలో ప్రధాని ప్రయత్నించింది.. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వాదాన్ని బలహీనపరచడమేనన్నారు.
జన్ధన్, ఆధార్-మొబైల్, జీఎస్టీలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ప్రధాని చేసిన అత్యంత హాస్యాస్పదమైన వాదనలలో ఇది కూడా ఒకటన్నారు. ఇందిరాగాంధీ బ్యాంకింగ్ రంగాన్ని జాతీయం చేసిన మాట గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. సార్వత్రిక బ్యాంకు సేవలకు పునాది వేశారు. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా నుండి 2010 సెప్టెంబర్ 29న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చారు.
ALSO READ: ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదు.. మహిళలందరికీ నా క్షమాపణలు – ప్రధాని మోదీ
దేశ డిజిటల్ విప్లవానికి రాజీవ్గాంధీ దార్శనికత, లక్ష్యాలే రూపకల్పన చేశాయి.. సాధ్యం చేశాయన్నారు. జీఎస్టీని డాక్టర్ మన్మోహన్సింగ్ ప్రభుత్వమే ముందుకు తెచ్చిందన్నారు. అప్పట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వ్యతిరేకత కారణంగా అది ఆమోదం పొందలేకపోయిందన్నారు.
అదే ముఖ్యమంత్రి.. కోవిడ్ సమయంలో కోట్లాది మంది భారతీయులకు జీవనాధారంగా నిలిచిన జాతీయ ఆహార భద్రతా చట్టం-2013, ఎంజీఎన్ఆర్ఈజీఏలను వ్యతిరేకించారని వివరించారు. ప్రధాని ఒక అబద్ధాల కోరని, ఈ విషయాన్ని రాత్రి ప్రసంగం ద్వారా ఆయన మరోసారి నిరూపించుకున్నారని తెలిపారు. దేశ మహిళలకు వారి హక్కులను అందించడానికి ముహూర్తం అవసరం లేదన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ను అమలు చేయడానికి రేపు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రికి సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ.