Jairam Ramesh: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ల పేర్లన్నా, వారి భావజాలమన్నా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ఎక్కడలేని చికాకు, ద్వేషమని.. ఇదే వారి సిద్ధాంతానికి కేంద్రబిందువని ఆయన విమర్శించారు. ఈ ద్వేషం ఏదో ఒక రూపంలో ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉందని ఆరోపించారు.
గతేడాది సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి పార్లమెంటు వేదికగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల తనకున్న చిన్నచూపును, ధిక్కారాన్ని దాచుకోలేకపోయారని జైరాం రమేష్ గుర్తుచేశారు. “అంబేడ్కర్ పేరును ఉపయోగించడం ఒక ఫ్యాషన్గా మారింది” అంటూ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు వారి మనషత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. నేడు అదే అజెండాను మరింత ముందుకు తీసుకువెళుతూ.. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంట్లో నెహ్రూ పేరును తగ్గించి చూపించే ప్రయత్నాలు, వందేమాతరం విషయంలో అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయని అన్నారు.
గాంధీ, అంబేడ్కర్, నెహ్రూల ఉమ్మడి వారసత్వంపై ఆధారపడిన భారతదేశ ప్రజాస్వామ్య, రాజ్యాంగ సంప్రదాయాలను బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి నెమ్మదిగా క్షీణింపజేయాలని చూస్తోందని జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వారి పేర్లను చెరిపివేయడానికి, కించపరచడానికి పాలకులు ఎంతగా ప్రయత్నించినా.. భారతదేశ ఆత్మ నుంచి ఈ మహనీయులను వేరు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. కేవలం పేర్లను తొలగించడం ద్వారా ‘కొత్త భారతదేశాన్ని’ నిర్మించలేరని, ఎందుకంటే ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యం వారి వారసత్వం పునాదులపైనే నిలబడి ఉందని జైరాం రమేష్ తేల్చిచెప్పారు.