Jaishankar All Party Meeting: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ ఆసియా సంక్షోభంపై భారతదేశ విదేశాంగ విధానాన్ని, అంతర్జాతీయ సంబంధాల ప్రాముఖ్యతను రాజకీయ పక్షాలకు వివరించింది. ప్రపంచ దేశాలతో భారత్ కొనసాగిస్తున్న సమతుల్య వైఖరిని ఈ సందర్భంగా నొక్కి చెప్పింది.అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగడుతూనే.. దేశీయంగా ఇంధన, పౌర రక్షణపై భారత్ తనకున్న స్పష్టమైన కార్యాచరణను ఈ సమావేశం ద్వారా రాజకీయ పక్షాలకు వివరించింది.
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్పై అత్యంత కఠినమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. గ్లోబల్ డిప్లొమసీలో పాకిస్థాన్ ఒక దళారీ దేశం అని ఆయన అభివర్ణించారు. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలను సులభతరం చేసేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదనను భారత్ కొట్టిపారేసింది.
ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ను ఉటంకిస్తూ.. పాకిస్థాన్ కేవలం తన సొంత ప్రయోజనాల కోసం దళారీ వేషాలు వేస్తోందని భారత్ మండిపడింది. “భారత్ ఎప్పటికీ పాకిస్థాన్ లాగా మధ్యవర్తిగా లేదా దళారీ దేశంగా వ్యవహరించదు” అని మంత్రి జైశంకర్ స్పష్టం చేసినట్లు సమాచారం. 1981 నుంచి పాకిస్థాన్ అమెరికా రాయబార కార్యాలయంలో ‘ఇంట్రెస్ట్ సెక్షన్’ నిర్వహిస్తూ ఇలాంటి పనులే చేస్తోందని ప్రభుత్వ వర్గాలు గుర్తుచేశాయి.
పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళనలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. భారత్ ప్రస్తుతం తన చమురు దిగుమతులలో ఎక్కువ భాగం రష్యా నుంచి పొందుతోందని.. దీనివల్ల ఇంధన భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ప్రభుత్వం వివరించింది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, గత 15 ఏళ్లుగా భారత్ తన అవసరాల కోసం ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉందని.. ఇప్పుడు కూడా ఎల్పీజీ సరఫరా నిలకడగా ఉందని భరోసా ఇచ్చింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా వైవిధ్యమైన ఇంధన వ్యూహాన్ని భారత్ అనుసరిస్తోందని నేతలకు వివరించారు.
ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటివరకు 4,25,000 మంది భారతీయులను సురక్షితంగా ఇరాన్ నుంచి వెనక్కి తీసుకువచ్చినట్లు సమావేశంలో వెల్లడించారు. ఇంకా అక్కడ ఉన్న వారి ప్రయోజనాలను పర్యవేక్షించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభంపై భారత్ నిష్క్రియగా ఉందన్న విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. అన్ని వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, దౌత్యపరమైన ప్రకటనల ద్వారా శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది.
భారతదేశానికి అత్యంత పెద్ద వ్యాపార భాగస్వామిగా అమెరికా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో, సాంకేతిక మరియు వ్యూహాత్మక రంగాల్లో ఇజ్రాయెల్ మనకు అత్యంత కీలకమైన భాగస్వామి అని గుర్తుచేసింది. ఈ రెండు దేశాలతో ఉన్న సంబంధాలు భారత ఆర్థిక, రక్షణ వ్యవస్థలకు వెన్నెముక వంటివని వివరించింది.
పశ్చిమ ఆసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్ అందరితోనూ సమానమైన సంబంధాలను కొనసాగిస్తోందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఇరాన్తో దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగిస్తూనే, జాతీయ ప్రయోజనాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించింది. అటు అరబ్ దేశాలు, ఇటు ఇరాన్తో భారత్ స్నేహపూర్వక బంధాన్ని కాపాడుకుంటోంది.
Read Also: KTR: రూ.38కోట్ల విద్యుత్ భారం.. భట్టీని కలిసిన కేటీఆర్.. ఆపై కీలక విజ్ఞప్తి