Petrol Panic: సోషల్ మీడియా జనరేషన్లో నిజం కంటే.. అబద్ధం వేగంగా వైరల్ అవుతుంది. హైదరాబాద్ మహానగరంలో నెలకొన్న పెట్రోల్ ప్యానిక్.. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్. రాష్ట్రంలో ఇంధన కొరత మొదలైందని, పెట్రోల్ బంకులు మూతపబడబోతున్నాయని వచ్చిన వదంతులు.. లక్షలాది మంది వాహనదారులను ఆందోళనలోకి నెట్టింది. అంతే.. జనమంతా పనులు మానుకొని మరీ పెట్రోల్ బంకుల ముందు క్యూలు కట్టేశారు. ఫిల్లింగ్ స్టేషన్లు తెరవకముందే.. బారులు తీరారు. అవసరం ఉన్నా, లేకపోయినా.. ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. ఇంకొందరైతే.. క్యాన్లలో కూడా పెట్రోల్ నింపుకొని వెళ్లారు. రెండు రోజులుగా.. పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ చూస్తుంటే.. నిజంగానే పెట్రోల్ కొరత ఇంత తీవ్రంగా ఉందా? అనే భ్రమ కలిగింది. కానీ.. ఇదంతా నిజమైన కొరత వల్ల వచ్చింది కాదు. ఇదంతా.. కృత్రిమ కొరత వల్ల పుట్టుకొచ్చిన భయం.
పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోతోంది.. ఇంకొన్ని రోజుల వరకు పెట్రోల్ దొరకదన్న వదంతులు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయ్. ఈ ఫేక్ మెసేజ్లు హైదరాబాద్ లాంటి సిటీలోనూ, తెలంగాణలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిచ్చు పెట్టాయ్. ఇప్పటికే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో.. ఆయిల్ సప్లై ఆగిందనే వార్తలు చూసిన జనం.. పెట్రోల్ కొరత నిజమా? కాదా? అని నిర్ధారించుకోకుండానే, పెట్రోల్ బంకుల దగ్గరకు పరుగులు తీశారు.
కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల ముందు దర్శనమిచ్చిన నో స్టాక్ బోర్డులు కూడా జనాన్ని ఆందోళనకు గురిచేశాయ్. అంతే, దెబ్బకు అంతా వాహనాలు తీసుకొని.. బంకుల ముందు బారులు తీరారు. సాధారణంగా ఓ వాహనదారుడు తన అవసరానికి తగ్గట్లుగా.. లీటర్ నుంచి 4 లీటర్ల పెట్రోల్ పోయించుకుంటారు. కానీ, పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో ప్రతి ఒక్కరూ బైకులు, కార్లలో.. ట్యాంక్ ఫుల్ చేయించడం మొదలుపెట్టారు. దీనివల్ల.. బంకుల్లో ఉండాల్సిన సాధారణ స్టాక్ ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఇది.. చైన్ రియాక్షన్లా మారి మంతి ప్యానిక్ క్రియేట్ చేసింది.
నిజానికి, యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ ఆగిపోయింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వదంతులతో జనంలో ప్యానిక్ మొదలైంది. అవసరం ఉన్నా, లేకపోయినా.. ఎక్కువ మొత్తంలో వాహనాల్లో పెట్రోల్ కొట్టించేస్తున్నారు. వాటర్ బాటిళ్లు, టిన్లు, క్యాన్లలో కూడా నింపుకొని వెళ్తుండటంతో.. ఆటోమేటిక్గా 30 శాతం డిమాండ్ పెరిగింది. గల్ఫ్ నుంచి ఆయిల్ సప్లై ఆగిపోవడం, ప్యానిక్ వల్ల 50 శాతానికి పైగా కృత్రిమ కొరత పెరిగింది. జనం కూడా ఆలోచించకుండా, నిజాలని నిర్ధారించుకోకుండా, పెట్రోల్ దొరుకుతుందో, లేదో అనే టెన్షన్తో ఎక్కువగా కొనేస్తున్నారు. దాంతో.. నిజంగా అవసరమైన వాళ్లకు దొరకకుండా పోతోందని చెబుతున్నారు. అందువల్ల.. పబ్లిక్ ప్యానిక్ అవకుండా ఆలోచించాలని చెబుతున్నారు పెట్రోల్ బంకుల డీలర్లు.
పెట్రోల్ దొరకదా? నిజం బయటపెట్టిన ప్రభుత్వం
వాస్తవానికి.. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు చెబుతున్నట్లు.. ఎక్కడా సప్లై దెబ్బతినలేదు. పెట్రోల్ నిల్వలు కూడా బాగానే ఉన్నాయ్. పెట్రోలియం కంపెనీల లెక్కల ప్రకారం.. ఇంధన సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగలేదు. ఆయిల్ డిపోల దగ్గర తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయ్. రిఫైనరీల నుంచి డిపోలకు, అక్కడి నుంచి బంకులకు రావడంలో కొంత లాజిస్టికల్ ఆలస్యం జరిగింది అంతే. కానీ, సప్లై ఎక్కడా ఆగలేదు. సివిల్ సప్లైస్ శాఖ అధికారులు కూడా ప్రజలు ఆందోళన చెందొద్దని, బంకుల దగ్గర రద్దీ పెరగడం వల్లే స్టాక్ త్వరగా అయిపోతోందని చెబుతున్నారు.
హైదరాబాద్ ఒక్కటే కాదు రెండు రోజులుగా తెలంగాణలో దాదాపుగా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయ్. నిజానికి.. దేశంలో చమురు నిల్వలు అయిపోలేదు. సప్లై చైన్ దెబ్బతినలేదు. మరి.. ఎందుకీ గందరగోళం? దీని వెనకున్న అసలు కారణమేంటి? అనే ప్రశ్నలు తలెత్తితే.. ఆయిల్ కంపెనీల లోపాలే కనిపిస్తున్నాయ్. ఈ కృత్రిమ కొరత పెరగడానికి వదంతులు ఎంత కారణమో.. ఆయిల్ కంపెనీలు కూడా అంతే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయ్.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా, దేశీయంగా రిటైల్ ధరలను పెంచకుండా ప్రభుత్వం నియంత్రించింది. సప్లై బాగానే ఉందని, దేశంలో ఇంకొన్నిరోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, పెట్రోల్ కొరత ఇప్పట్లో తలెత్తే పరిస్థితులు లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా.. జనం మాత్రం సీరియస్గా తీసుకోవడం లేదు. ఇందుకు.. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడమే కారణం. కానీ, ఈ బోర్డుల వెనక ఉన్న కారణాలు వేరు. ఈ సంక్షోభ సమయంలో ఆయిల్ కంపెనీలు వ్యవహరించి తీరే.. ఈ కృత్రిమ కొరతకు దారితీసిందనే చర్చ జోరుగా సాగుతోంది. పెట్రోల్ బంకులకు సరఫరాలో చిన్న బ్రేక్ రావడంతో.. ఆ భారం బంకులపై పడింది.
ఇక.. పెట్రోల్ డీలర్లకు ఇచ్చే క్రెడిట్ సదుపాయాన్ని నిలిపేసి, ముందస్తు చెల్లింపులు ఉంటేనే.. ట్యాంకర్లు పంపడం మొదలుపెట్టారు. దీనివల్ల కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల డీలర్లు సరిపడా స్టాక్ పెట్టుకోలేకపోయారు. దాంతో.. కొన్ని బంకుల ముందు మాత్రమే నో స్టాక్ బోర్డులు వెలిశాయ్. ఇది చూసిన కొందరు అత్యుత్సాహవంతులు.. యుద్ధం వల్ల పెట్రోల్ కొరత మొదలైపోయిందని, ఇప్పుడే ట్యాంకులు ఫుల్ చేయించేసుకోవాలని.. ఓవర్గా రియాక్ట్ అయ్యారు. దాంతో.. జనంలో ప్యానిక్ మొదలై.. పెట్రోల్ బంకుల ముందు క్యా కట్టేశారు. సోషల్ మీడియాలో.. రేపటి నుంచి పెట్రోల్ దొరకడం కష్టమేననే పుకార్లు కూడా జనంలో భయాన్ని నింపాయ్. అంతా.. ఒక్కసారిగా పెట్రోల్ బంకులపై పడటంతో.. డిమాండ్ వర్సెస్ సప్లై గ్యాప్ పెరిగి బంకులు ఖాళీ అయ్యాయ్.
ఆయిల్ కంపెనీలు వేగంగా సప్లై చేయకపోవడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని, పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు. కొందరైతే.. డబ్బులు కట్టినా పెట్రోల్ ట్యాంకర్లు సమయానికి రావట్లేదని చెబుతున్నారు. క్రెడిట్ లిమిట్స్ వల్ల కూడా పెట్రోల్ సప్లై ఆగుతోందని చెబుతున్నారు. తమ ఖాతాలో నగదు జమ చేస్తేనే.. పెట్రోల్ సప్లై చేస్తామని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయ్. అడ్వాన్స్ పేమెంట్స్ చేయమంటున్నాయ్. అయినా.. సప్లై వేగంగా చేయడం లేదంటున్నారు డీలర్లు. పైగా.. గత వారం ఉగాది, రంజాన్తో పాటు వీకెండ్ సెలవులు రావడంతో.. ఆయిల్ కంపెనీల డిపోలు పనిచేయలేదు. దాంతో.. ఒక్కసారిగా కొరత తలెత్తిందంటున్నారు. సెలవు రోజుల్లో ఆయిల్ డిపోలు పనిచేయకపోవడంతో.. దాని ఎఫెక్ట్ సోమవారం పడింది. అదే రోజు జనంలో ప్యానిక్ మొదలైంది. అది మరుసటి రోజు కూడా కంటిన్యూ అయింది. దాంతో.. నిజంగానే కొరత తలెత్తిందేమోనని.. జనంలో భయం మొదలైంది.
ప్రస్తుతానికి.. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఎలాంటి పెట్రోల్ కొరత లేదు. ఇది.. కేవలం ఆయిల్ కంపెనీల నిర్వహణ లోపం. వాళ్లు.. క్రెడిట్ లిమిట్స్ తీసుకురాకుండా, ముందున్న పద్ధతుల్లోనే ఆయిల్ సప్లై చేసి ఉంటే.. ఈ పరిస్థితి తలెత్తేది కాదు. సంక్షోభ సమయాల్లో సామాన్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిపోయి.. ఇలా రూల్స్ మార్చేయడమేంటనే విమర్శలు వస్తున్నాయ్. దేశంలో ఓ క్రైసిస్ వచ్చినప్పుడు.. ఆయిల్ కంపెనీలు విరామం లేకుండా పనిచేయాలి. కొరత తలెత్తకుండా చూసుకోవాలి. డిమాండ్ తగినట్లు.. సప్లై చేయాలి. ఇవేవీ చేయకుండా.. సెలవులు తీసుకొని రిలాక్స్ అయిపోతే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయ్.
మరోవైపు, ప్రభుత్వం, అధికారులు కూడా సకాలంలో జోక్యం చేసుకొని జనానికి భరోసా ఇవ్వడంలో వెనుకబడినట్లు కనిపిస్తోంది. కొరత లేదని ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఆయిల్ కంపెనీలు తమ బాధ్యతని గుర్తుంచుకోవాలి. ఆయిల్ నిల్వలున్నాయని చెబితే సరిపోదు. స్టాక్ ఉండటమంటే.. ఆయిల్ డిపోల్లో ఉండటం కాదు కదా! పెట్రోల్ బంకుల్లో ఉంటేనే.. కొరత లేనట్లు. అలా కాకుండా.. ఆయిల్ కంపెనీల దగ్గరే పెట్రోల్ ఉంటే జనం అవసరాలు తీరతాయా? ప్రజా ప్రయోజనాల గురించి కూడా ఆలోచిస్తే.. ఇలాంటి కృత్రిమ కొరత తలెత్తే పరిస్థితి ఉండదు.
జనం కూడా ఏది నిజమో, ఏది అబద్ధమో నిర్ధారించుకోవాలి. వదంతలు నమ్మి.. ఎగేసుకొని వెళ్లిపోతే, టైమ్ వేస్ట్ అవడమే కాదు, అనవసరమైన గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయ్. సంక్షోభ సమయాల్లో.. అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలి. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో.. ఇన్ఫర్మేషన్ ఎంత బలమో, మిస్-ఇన్ఫర్మేషన్ అంతకంటే ప్రమాదకరం. పెట్రోల్ కొరత అనేది ఓ డిజిటల్ భ్రమ మాత్రమే. కాస్త.. ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయ్. ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యహరించి.. అన్ని రోజులూ సప్లై కొనసాగిస్తే.. కృత్రిమ పెట్రోల్ కొరత తలెత్తే పరిస్థితులే ఉండవంటున్నారు.
Also Read: మతం మారినట్లు ఎలా నిరూపిస్తారు? కోర్టులు పరిగణనలోకి తీసుకునే సాక్ష్యాలివే!