Justice Suryakant: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్ మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా చరిత్రలో నిలిచారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన ఆయన, చిన్న వయసులోనే న్యాయరంగంపై ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆయన, పట్టుదలతో న్యాయవిద్యను అభ్యసించి, అద్భుత ప్రతిభను ప్రదర్శించారు.
Also Read: బహ్రెయిన్-హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి దారి మళ్లింపు, అసలేం జరిగిందంటే?
జస్టిస్ సూర్య కాంత్ 2004 జనవరిలో పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత వివిధ హైకోర్టులలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2018 అక్టోబర్లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే, 2024 నవంబరు 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్గా పనిచేస్తున్నారు. గత ఆరు సంవత్సరాలలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ 300కి పైగా తీర్పులను ఇచ్చారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/t56AZEV93g
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2025