Flight Diverted: బహ్రెయిన్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం నాడు ఈ బెదిరింపు ఈమెయిల్ పంపించగా, విమానయాన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని గమ్యస్థానం కంటే ముందుగా ముంబైకి దారి మళ్లించారు. ఈ ఘటనతో విమానంలో ఉన్న 154 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ముంబై విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది చురుగ్గా కదిలారు. బాంబు డిటెక్షన్ బృందాలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల తరబడి సాగిన ఈ తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. విమానంలో బాంబు లేదని అధికారులు ధృవీకరించారు. ఇది కేవలం తప్పుడు బెదిరింపు మాత్రమేనని తేలింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
తనిఖీ పూర్తయ్యాక, విమానాన్ని తిరిగి హైదరాబాద్ పంపించడానికి అధికారులు అనుమతించారు. ప్రయాణికులు సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ తప్పుడు బెదిరింపు మెయిల్ పంపినవారిని గుర్తించేందుకు భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విమానాశ్రయ భద్రతా అధికారులు స్పష్టం చేశారు. విమాన ప్రయాణ భద్రత అంశంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని తెలిపారు. విమానయాన భద్రత సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని.. ప్రయాణికులు ఆందోళన చెందవద్దని కోరారు.
ALSO READ: Spirit : మెగాస్టార్ తో సందీప్ రెడ్డి డైరెక్షన్ టీం, ఆ దర్శకుడు మళ్లీ చేరాడా?