Bengaluru Politics: కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. పవర్ షేరింగ్ రాజకీయాలు నడుస్తున్న వేళ.. కీలక నేతల మధ్య బ్రేక్ ఫాస్ట్ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారాయి. తాజాగా డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్కు వెళ్లారు సీఎం సిద్ధరామయ్య.
కర్ణాటకలో బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు
కర్ణాటక అధికార కాంగ్రెస్లో రాజకీయం ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార పంపిణీపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన ఇంటికి సీఎం సిద్ధరామయ్య బ్రేక్ ఫాస్ట్కు పిలిచారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి డీకే సురేష్ స్వాగతం పలికారు.
ఇరువురు నేతల మధ్య పవర్ షేరింగ్ ఫార్ములాపై ముమ్మర చర్చలు జరిగినట్టు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విభేదాలు లేకుండా నేతల మధ్య సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ పెద్దల సలహా మేరకు బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి.
డీకే పిలుపు.. సీఎం సిద్ధరామయ్య హాజరు
నాటు కోడి పులుసు, ఇడ్లీ, ఉస్మా, దోశ, కాఫీ వంటి వాటితో సీఎం సిద్ధరామయ్యకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు డీకే. నాయకత్వం మార్పు విషయంలో ఐక్యంగా ఉన్నామని, అధిష్టానం ఏం చెబితే అది చేస్తామని సిద్ధరామయ్య, డీకేలు చెబుతున్నారు. పార్టీ అంతర్గత విషయాలపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ, కేంద్రం వద్ద పెండింగ్ అంశాలపై వీరిరువురు చర్చించినట్టు సమాచారం.
డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ వేదికగా ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ ప్లాన్ చేసినట్టు వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి కర్ణాటక కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. డిసెంబర్ 8 నుంచి బెళగావిలోని సువర్ణ సౌధ భవనంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి.
ALSO READ: షాకింగ్.. బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు కుర్చీ మార్పిడి ఆయుధం కాకూడదని భావించినట్టు తెలుస్తోంది. అందుకోసమే బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు మొదలైనట్టు సమాచారం. తాము కలిసి పని చేస్తామని ఈ మేరకు ఎక్స్లో రాసుకొచ్చారు డిప్యూటీ సీఎం డీకే. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, మరింత సమన్వయంతో కలిసి పని చేయడం కోసం ముఖ్యమంత్రిని బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించానని రాసుకొచ్చారు. గత శనివారం వీరిద్దరూ సిద్ధరామయ్య ఇంట్లో సమావేశం అయ్యారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ప్రకటించారు. అధిష్ఠానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని తెలిపారు.