Lok Sabha Ruckus: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన లోక్సభలో బడ్జెట్పై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేశారు. బడ్జెట్పై అర్థవంతమైన చర్చలు జరగాలని తాము కాంగ్రెస్ పార్టీని చేతులు జోడించి మరీ వేడుకున్నామని, కానీ వారు చర్చకు సిద్ధంగా లేరని రిజిజు పేర్కొన్నారు. ప్రతిరోజూ సభ మధ్యలోకి (వెల్) వచ్చి గందరగోళం సృష్టించడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ తీరు పార్లమెంట్ గౌరవాన్ని ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి రిజిజు మండిపడ్డారు. ప్రధాని కూర్చునే సీటు వద్దకు వెళ్లి కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్న దృశ్యాలను ఆయన ఎత్తిచూపారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, తమ ఎంపీల తీరుపై కాంగ్రెస్ పార్టీ గర్వంగా ఉందని అనుకుంటుందేమోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చించకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభను స్తంభింపజేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. సభా నిబంధనలను అతిక్రమిస్తూ, స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని రిజిజు స్పష్టం చేశారు. విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, పార్లమెంట్ విలువలను కాలరాస్తున్నాయని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు.
కాగా, లోక్సభలో బడ్జెట్ చర్చ సందర్భంగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిని చుట్టుముట్టే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని లోక్ సభ స్పీకర్ కార్యాలయం పేర్కొంది. లడఖ్ సరిహద్దు అంశంపై ఎం.ఎం. నరవణే పుస్తకంలోని వివరాలు, ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్పై కాంగ్రెస్ సభ్యులు నిలదీస్తూ ఈ నిరసన చేపట్టారు. ప్రధానిపై దాడికి ప్లాన్ చేశారనే వార్తలు సంచలనం రేపగా, మాట్లాడే అవకాశం ఇవ్వనందునే నిరసన తెలిపామని కాంగ్రెస్ సమర్థించుకుంది. ఇది పార్లమెంటరీ చరిత్రలోనే దురదృష్టకరమని అధికార పక్షం మండిపడింది.
ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంట్లో జరిగింది ఇది: వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి రిజిజు
ఫిబ్రవరి 4న పార్లమెంట్లో ప్రధాని సీటు వద్ద కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్న వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు 'ఎక్స్'లో షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనపై ఆ పార్టీ గర్వంగా ఉందంటూ… pic.twitter.com/911o10yBB6
— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2026
Read Also: Manipur Violence: మణిపూర్లో మళ్లీ హింస.. సాయుధ గ్రూపుల ఇళ్లకు నిప్పు, మళ్లీ కర్ఫ్యూ