Manipur Violence: మణిపూర్లో మళ్లీ హింస మొదలైందా? ఈసారి సాయుధ బలగాలను కొన్నివర్గాలు టార్గెట్ చేశాయా? శాంతి భద్రతల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించిందా? అవుననే అంటున్నాయి బలగాలు. మళ్లీ అల్లర్లు చెలరేగడానికి కారణమేంటి?
మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో మంగళవారం ఉదయం సాయుధ గ్రూపులు ఇళ్లకు కొంతమంది నిప్పు పెట్టారు. ఆ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఐదురోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఫోటోలు, వీడియోలు పోస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలకు దిగింది. సోమవారం మధ్యాహ్నం లిటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ బహిరంగ సభ జరిగింది. దీనికి ఉప ముఖ్యమంత్రితోపాటు రెండు వర్గాల కమ్యూనిటీ నాయకులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఇరువైపులా శాంతి కోసం అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు.
సాయుధ గ్రూపుల ఇళ్లకు నిప్పు, మళ్లీ కర్ఫ్యూ
సోమవారం రాత్రి లిటాన్ సరీఖోంగ్ గ్రామంలో సాయుధ గ్రూపులు ఇళ్లను తగులబెట్టారు కొందరు వ్యక్తులు. ఆ తర్వాత గాల్లోకి అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో కొండ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. హింస పెరుగుతుందనే భయంతో చాలామంది గ్రామస్తులు అవసరమైన వస్తువులతో పొరుగునున్న కాంగ్ పోక్పి జిల్లాకు తరలిపోయారు.
మెయిటీ-కుకి వివాదంలో నాగాలు ఎక్కువగా తటస్థంగా ఉన్నారు. అయినప్పటికీ స్థానిక ఘర్షణలో హింస చెలరేగడం ఆందోళనను రేకెత్తించింది. ఈ ఘటనలో తంగ్ఖుల్ నాగా వర్గానికి చెందిన 21 ఇళ్ళు, కుకి-జో వర్గానికి చెందిన మూడు ఇళ్ళు ధ్వంసమయ్యాయి. డ్యామేజ్ అయినవాటిలో కొన్ని ప్రభుత్వ గృహాలు ఉన్నాయి.
ALSO READ: చలో భారత్.. కేంద్రం వర్సెస్ కార్మిక సంఘాలు.. 12న దేశవ్యాప్త బంద్
ఉద్రిక్తతలు తీవ్రంగా కావడంతో మణిపూర్ ప్రభుత్వం ఉఖ్రుల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రజా భద్రత, శాంతికి ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఐదు రోజుల ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అల్లర్లు మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు బలగాలు మోహరించాయి.