Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాజధాని ఢిల్లీ వేదికగా ప్రస్తుత జాతీయ పరిస్థితులపై చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా.. సామాజికంగానూ పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను ప్రస్తావిస్తూ, యువత భవిష్యత్తును కాపాడటమే తమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.
దేశాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లు
ప్రస్తుతం మన దేశం అనేక సంక్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుందని ఖర్గే ఆందోళన వెలిబుచ్చారు. నిత్యం పెరుగుతన్న ద్రవ్యోల్బణం ( ధరల పెరుగుదల), కొట్లాది మంది యువతను వేధిస్తున్న నిరుద్యోగం, రోజురోజుకూ పెరిగిపోతున్న సామాజిక అసమానతలు దేశ ప్రగతికి ఆవరోధంగా మరాాయని ఆయన పేర్కొన్నారు. ఈ సవాళ్లను అధిగమించడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు.
విద్యా వ్యవస్థలో సంక్షోభం, లీకేజీల కలకలం
ఖర్గే తన ప్రసంగంలో ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరీక్షల కుంభకోణాలను ప్రస్తావించారు. నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలతో పాటు, వివిధ ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ వివాదాలు కేవలం పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా.. రాత్రింబగళ్లు కష్టపడి చదివే లక్షలాది మంది విద్యార్థుల, వారి కుటుంబాల నమ్మకాన్ని, భవిష్యత్తును పూర్తిగా కదిలించివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యువతకు అండగా రాహుల్ గాంధీ
ఇలాంటి కష్టకాలంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి, బాధితులైన విద్యార్థులను, యువతను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారని ఖర్గే గుర్తుచేశారు. యువత పడుతున్న బాధను, వారి అక్రోశాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బలంగా వినిపించారని, వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వ్యవస్థల బలహీనత – రాజ్యాంగ పరిరక్షణ
దేశంలో దశాబ్దాల తరబడి ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రభుత్వ సంస్థలను, ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రస్తుత పాలకులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. అందుకే, తమ బాధ్యత కేవలం ఎన్నికల రాజకీయాలకో, అధికార పోరాటానికో పరిమితం కాదని స్పష్టం చేశారు. భారతదేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడమే తమ అసలైన కర్తవ్యమని ఖర్గే పిలుపునిచ్చారు.
Aslo Read: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్లో భారీ దోపిడీ.. రూ. 2 కోట్ల విలువైన ఐఫోన్లు లూటీ!