UP Alliance: దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికలను దేశ పార్లమెంటరీ ఎలక్షన్స్ కు ముందు సెమీ ఫైనల్స్ గా అందరూ భావిస్తుంటారు. కాబట్టి యూపీలో 2027లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతీయ పార్టీ సమాజ్ వాదీతో పొత్తు పెట్టుకునేందుకు స్నేహం హస్తం చాచింది.
రాబోయో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు అసదుద్దీన్ ఓవైసీ కీలక విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఎంఐఎం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇందుకు చర్చలు జరపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు మెురాదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమం వేదికగా ఎస్పీ అధినేతకు సందేశం పంపారు.
యూపీలో మరోమారు బీజేపీ ప్రభుత్వం రావాలని తాము కోరుకోవడం లేదని అసదుద్దీన్ అన్నారు. కాబట్టి పొత్తుపై మాట్లాడేందుకు ఇవాళే మంచి సమయమన్నారు. లేదంటే ఎన్నికలు ముగిశాక ఫలితాలు చూసి ఎడవకండి అంటూ పరోక్షంగా ఎస్పీకి చురకలు అంటించారు. అయితే అసదుద్దీన్ పిలుపుపై అఖిలేశ్ యాదవ్ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. పొత్తుపై వారి వైఖరి ఎలా ఉంటుందో స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు ఎస్పీతో పొత్తు గురించి హైదరాబాద్ కు చెందిన ఓ ఎంఐఎం ఎంపీ స్పందించారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. ‘మా గౌరవం, న్యాయం కోసమే మా పోరాటం. మాకు సమానత్వం కావాలి. ఒకవేళ అఖిలేశ్ సీఎం కుర్చీలో కూర్చుంటే ఓవైసీ కూడా ఆ కూర్చు పక్కన పద్మాసనం వేసుకొని తమ వారి హక్కులు, న్యాయం గురించి మాట్లాడతారు’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: ఫ్లాప్ షో నుంచి హిస్టారికల్ విక్టరీ దాకా.. 37 రోజుల్లో ఢిల్లీని ఊపేసిన జెన్-జీ తుఫాన్!
మరోవైపు ఎస్పీతో పొత్తుకు ఎంఐఎం మెుగ్గు చూపడంపై యూపీకి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావాలా ఘాటుగా స్పందించారు. దీనిని ఓటు బ్యాంకు రాజకీయాల కుట్రగా పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్, ఓవైసీ ఒకరినొకరు ప్రసన్నం చేసుకోవడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. వారు అధికారికంగా పొత్తులో ఉన్నా లేకున్నా వారి మధ్య అంతర్లీనంగా బంధం కొనసాగుతోందన్నారు. ఓవైసీ, యాదవ్ ఒక నాణెలకి రెండు ముఖాల వంటి వారని ఆరోపించారు.
Also Read: ఫేస్బుక్లో పొరపాటున స్టోరీ పోస్ట్ చేశారా? ఇలా క్షణాల్లో డిలీట్ చేసేయండి!