Mark Zuckerberg Apology: మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ పార్లమెంటరీ ప్యానెల్కు క్షమాపణలు చెప్పారు. తమ ప్లాట్ఫారమ్లలో (ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్) బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CSAM), డీప్ఫేక్ వీడియోలు ప్రత్యక్షం కావడం, అలాగే సాంకేతిక లోపాల కారణంగా చోటుచేసుకున్న పొరపాట్లపై ఆయన విచారం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శితో జరిగిన కీలక సమావేశంలో మెటా ప్రతినిధులు పాల్గొని.. జుకర్ బర్గ్ స్వయంగా క్షమాపణలు చెప్పిన విషయాన్ని చెప్పారు. కొన్ని ప్రత్యేక రకాల కంటెంట్ను ప్రచారం చేయడానికి భారీగా డబ్బులు పొందినట్లు కూడా అంగీకరించారు. జరిగిన పొరపాట్లకు చింతిస్తున్నామని, భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వర్టికల్ వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు తాత్కాలికంగా తొలగించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి నేరుగా మాట్లాడిన వీడియోను మెటా తొలగించింది. అనంతరం దానిని పునరుద్ధరించింది. అయితే సాంకేతిక లోపం వల్లనే ఈ పొరపాటు జరిగిందని మెటా ఇందుకు వివరణ కూడా ఇచ్చింది. అయితే కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ సమాధానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని సమాచార సాంకేతికతపై ఏర్పడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించే ప్లాట్ఫారమ్లపై, ముఖ్యంగా బాల లైంగిక వేధింపుల మెటీరియల్, మహిళలను తక్కువ చేసి చూపే కంటెంట్ను అడ్డుకోవడంలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో మెటా గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లాన్ నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో దాదాపు 45 నిమిషాల పాటు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
Also Read: ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!
భారత్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు కోట్లాది మంది యూజర్లు ఉన్న విషయాన్ని ఐటీ శాఖ కార్యదర్శి మెటా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. బాలల లైంగిక కంటెంట్, డీప్ ఫేక్ వీడియోల కట్టడికి మెటా తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరించాలని కోరారు. మెటా అన్ని నిబంధనలను పాటిస్తుందో లేదో తాము తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సెక్షన్ 79 కింద సేఫ్ హార్బర్ సెక్యూరిటీని ఫేస్ బుక్ కు ఎందుకు తొలగించకూడదో చెప్పాలని కోరారు. కేంద్రం అభ్యంతరాలపై ఆందోళన వ్యక్తం చేసిన మెటా ప్రతినిధులు.. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మెటా సీఈఓ జుకర్ బర్గ్ సైతం వ్యక్తిగతంగా తన క్షమాపణలను మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంలో స్పష్టత కోసం మెటా అధికారులను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి.
Also Read: ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?