National Herald Case: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఊరట లభించింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీలాండరింగ్ అభియోగాలపై.. విచారణ జరపడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. దీంతో ఈడీ కేసు ఈ దశలో ముందుకు సాగదన్న స్పష్టత వచ్చింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఈ నిర్ణయం రాజకీయంగా, న్యాయపరంగా విస్తృత చర్చకు దారి తీసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు.. మరో ఐదుగురిపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసును విచారించాలంటే తప్పనిసరిగా మొదటి ఎఫ్ఐఆర్ ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. FIR లేకుండా ఈడీ ఫిర్యాదుపై విచారణ జరపడం చట్టబద్ధం కాదని తేల్చింది.
రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ అంశంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదుకు విచారణ అర్హత లేదని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మొదలైందని గుర్తు చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, ఆ కేసు ఒక నిర్దిష్ట దశలో ఉన్నప్పుడు ఈడీ స్వతంత్రంగా మనీలాండరింగ్ కేసు విచారించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారీ వంటి వ్యక్తులు, సంస్థలను కూడా ఈడీ నిందితులుగా చేర్చింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అనే నేషనల్ హెరాల్డ్ ప్రచురణ సంస్థ ఆస్తులను యంగ్ ఇండియన్ అనే కంపెనీ.. మోసపూరితంగా స్వాధీనం చేసుకుందన్నది ఈడీ ప్రధాన ఆరోపణ.
ఏజేఎల్ కు చెందిన ఆస్తులు నేర ఆదాయంగా మారాయని, వాటి విలువ రూ.2,000 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంది. సోనియా, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ సంస్థలో మెజారిటీ వాటాదారులుగా ఉన్నారని, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా పొందేందుకు కుట్ర పన్నారని ఈడీ అభియోగాలు మోపింది. AJL వాటాలను యంగ్ ఇండియన్కు బదిలీ చేయడం ద్వారా చట్టవిరుద్ధ లాభాలు పొందారని, ఆస్తుల నుండి వచ్చే అద్దె కూడా నేరపూరిత మార్గాల ద్వారానే వచ్చిందని ఈడీ పేర్కొంది.
Also Read: అటెన్షన్ ప్లీజ్.. ప్రయాణికులకు ముఖ్య గమనిక, ఎయిరిండియా-ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ
అయితే, ఈడీ ఆరోపణలు విచారణ దశకు రావడానికి అవసరమైన చట్టపరమైన ఆధారాలు ఈ దశలో లేవని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లేకుండామనీలాండరింగ్ నిరోధక చట్టం కింద.. విచారణ కొనసాగించడం సాధ్యం కాదని తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. దీంతో సోనియా, రాహుల్ గాంధీలకు తాత్కాలిక న్యాయ ఊరట లభించినట్లైంది.
ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తోంది. రాజకీయ కక్షతోనే ఈడీ కేసులు పెట్టిందన్న తమ వాదనకు ఇది బలం చేకూర్చిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, న్యాయపరమైన ప్రక్రియ ఇంకా పూర్తిగా ముగియలేదని, అవసరమైతే పై కోర్టులను ఆశ్రయిస్తామని ఈడీ వర్గాలు సూచిస్తున్నాయి.